గోల్డ్ స్మగ్లింగ్ కేసు: రన్యారావుతో పాటు బుక్కయిన తెలుగు నటుడు
తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చర్చగా మారింది. రన్యారావు, ఆమె స్నేహితలు అయిన తెలుగు నటుడు, బంగారం వ్యాపారిపై అత్యంత కఠినమైన చట్టాన్ని అమలు చేయనున్నారు.
By: Tupaki Desk | 26 April 2025 9:27 AM ISTదుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి అక్రమ బంగారం రవాణా చేసిన కేసులో కన్నడ నటి రన్యారావు, ఆమెకు సహకరించిన తెలుగు నటుడు, బళ్లారికి చెందిన ఆభరణాల వ్యాపారిపై కేసు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చర్చగా మారింది. రన్యారావు, ఆమె స్నేహితలు అయిన తెలుగు నటుడు, బంగారం వ్యాపారిపై అత్యంత కఠినమైన చట్టాన్ని అమలు చేయనున్నారు. అలాగే రన్యా రావుపై కఠిన అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు పంపారు.
భారతదేశ కఠినమైన విదేశీ మారక ద్రవ్యం & అక్రమ రవాణా నిరోధక చట్టం కింద ఆ ముగ్గురిపైనా కేసు నమోదైంది. దీని ప్రకారం బంగారం కానీ ఏదైనా వస్తువును కానీ తమ వద్ద దాచి ఉంచకూడదు.. రవాణా చేయకూడదు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ & స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం, 1974 లేదా COFEPOSA కింద కేసు నమోదు చేసి నిర్బంధించారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక నిఘా బ్యూరోకి ఉత్తర్వు అందింది.
ముగ్గురు స్నేహితులు ఒక సిండికేట్ గా ఏర్పడి ఏడాది కాలంగా బంగారం అక్రమ రవాణాను కొనసాగించారు. వారు కనీసం 100 కిలోల బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా రవాణా చేసినట్లు అనుమానిస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. అటుపై బెంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారంతో రన్యా పట్టుబడ్డారు. తనకు దుబాయ్ లో తెలుగు నటుడు బంగారాన్ని అందించాడు. ఎవరో తనను తప్పుగా ఇరికించేందుకు ప్రయత్నించారని రన్యా బుకాయించాలని చూసినా కస్టమ్స్ అధికారుల ముందు తన పప్పులు ఉడకలేదు. 2023లో దుబాయ్లో `వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సి` అనే కంపెనీని స్థాపించి రణ్యా తన ఇద్దరు స్నేహితులతో కలిసి బంగారం వ్యాపారం ప్రారంభించారని విచారణలో నిగ్గు తేల్చారు. కానీ అక్రమ రవాణాలో దిగుమతి సుంకాన్ని ఎగవేసిన కారణంగా రణ్యా దొరికిపోయింది. వీరా డైమండ్స్ కంపెనీ జెనీవా , బ్యాంకాక్ నుండి దుబాయ్కు బంగారాన్ని దిగుమతి చేసుకుని, కస్టమ్స్ సుంకాన్ని ఎగ్గొట్టి భారతదేశానికి అక్రమంగా రవాణా చేస్తుందని ఏజెన్సీ విచారణలో తెలిపింది. అధికారుల విచారణలో ఈ కంపెనీ తప్పుడు పత్రాలు సృష్టించి భారీ మోసానికి పాల్పడిందని డిఆర్ఐ వెల్లడించింది.
