Begin typing your search above and press return to search.

ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో రాముడు పెట్టుబ‌డి!

రియ‌ల్ ఎస్టేట్ రంగంలో సెల‌బ్రిటీల దూకుడు ఎలా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   15 May 2026 5:00 AM IST
ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో రాముడు పెట్టుబ‌డి!
X

రియ‌ల్ ఎస్టేట్ రంగంలో సెల‌బ్రిటీల దూకుడు ఎలా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ అన్ని ప‌రిశ్ర‌మ‌ల న‌టులు రియ‌ల్ రంగంలో భారీ పెట్టు బ‌డులు పెడుతున్నారు. త‌మ వ్యాపారాల‌ను విదేశాల‌కు సైతం విస్త‌రిస్తోన్న వైనం క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. దాదాపు అగ్ర స్థాయి న‌టులంతా కూడా ఈ రంగంలో స‌క్సెస్ పుల్ గా దూసుకుపోతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ కపూర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్యలో భారీ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతున్న తరుణంలో రణబీర్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరిం చుకుంది.

భక్తితోనే కాకుండా ఆర్థికపరమైన వ్యూహంతో కూడా ఆయన పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. హౌస్ ఆఫ్ అభినందన్ లోధా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో రణబీర్ ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. దాదాపు 3.31 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ ర‌ణ‌బీర్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు సమాచారం. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. అలాంటి చోట స్థలం దక్కిం చుకోవడం అంటే గొప్ప ఆస్తిగానే భావించాలి. రణబీర్ కపూర్ ఇప్పటికే ముంబైలో ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నారు. కానీ అయోధ్యలో పెట్టుబడి పెట్టడం వెనుక ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్ `రామాయణ` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అత‌డు శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పాత్రపై ఉన్న గౌరవంతో అయోధ్యలో నివాసాన్ని నిర్మించు కోవాలని ఆలోచ‌న కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయోధ్య ఇప్పుడు పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. అదొక గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్ గా మారింది. రణబీర్ కంటే ముందు అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు కూడా అయోధ్య‌లో స్థలాలను కొనుగోలు చేశారు. స్టార్ హీరోలందరూ ఇలా అయోధ్య బాట పట్టడం తో అక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి భూమ్ ఏర్ప‌డింది.

దీంతో పాటు అయోధ్య‌కు మ‌రింత గ్లామర్ తోడయ్యింది. భవిష్యత్తులో అయోధ్యలో మ‌రింత మంది సెలబ్రిటీలు పెట్టుబ‌డులు పెట్టే అవకాశం క‌నిపిస్తోంది. రణబీర్ వంటి యూత్ ఐకాన్ అక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఇతర యువ ఇన్వెస్టర్లలో కూడా ఆసక్తి నెలకొంది. రామమందిర దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో? అక్కడ హోటళ్లు , విలాసవంతమైన నివాసాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రణబీర్ కపూర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన దూరదృష్టిని చాటిచెబుతోంది. శ్రీరాముడి భక్తుడిగా ఒక వ్యాపారవేత్తగా ర‌ణ‌వీర్ వేసిన అడుగు ఇండ‌స్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.