దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 400 స్కూళ్లలో 'రామాయణం' ప్రచారం!
భారతీయ సినిమా చరిత్రలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం`.
By: Sivaji Kontham | 11 July 2026 6:00 AM ISTసినిమా థియేటర్లలోకి వచ్చే ముందే విద్యార్థులకు భారతీయ ఇతిహాసంలోని కథలు - విలువలను పరిచయం చేసే లక్ష్యంతో `రామాయణం` చిత్ర బృందం దేశవ్యాప్త పాఠశాల ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. జూలై 9న ప్రారంభం కానున్న ఈ ప్రచారం ద్వారా, 18 నగరాల్లోని 400కు పైగా పాఠశాలల్లో 5 లక్షల మందికి చేరువవ్వాలనేది ప్లాన్! పూర్తి వివరాల్లోకి వెళితే....
భారతీయ సినిమా చరిత్రలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం`. `దంగల్` ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే సరికొత్త రీతిలో ప్రమోషన్స్ ప్రారంభించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల విద్యార్థుల కోసం ఒక భారీ ఔట్రీచ్ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం జూలై 9న ప్రారంభమైంది. దేశంలోని 18 ప్రధాన నగరాల్లో ఉన్న 400 కంటే ఎక్కువ పాఠశాలల్లో ఈ క్యాంపెయిన్ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులను రీచ్ అవ్వాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం కమర్షియల్ ప్రమోషన్స్ లాగా కాకుండా.. నేటి తరం పిల్లలకు రామాయణంలోని కథలను, గొప్ప విలువలను వినూత్న రీతిలో పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ క్యాంపెయిన్లో భాగంగా పాఠశాల విద్యార్థుల కోసం డ్రాయింగ్ పోటీలు, క్విజ్ పోటీలు, ఇంటరాక్టివ్ చర్చలు .. వినోదాత్మక తరగతి గది కార్యకలాపాలను ప్లాన్ చేశారు. విద్యార్థులు రామాయణంలోని పాత్రలను.. వాటి ప్రాముఖ్యతను సొంతంగా అర్థం చేసుకునేలా ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ``హమారా సత్య.. హమారా ఇతిహాస్`` అనే ఒక పవర్ఫుల్ థీమ్తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది పిల్లలతో పాటు వారి కుటుంబాలలోనూ రామాయణ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తికర చర్చకు తెర లేపుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్ఇజి , రాకింగ్ స్టార్ యష్కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్లో లార్డ్ రాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తుండగా.. రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ పురాణ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ అద్భుతమైన సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా మొదటి భాగం `దీపావళి 2026` కానుకగా విడుదల కానుండగా.. రెండవ భాగం దీపావళి 2027 న విడుదల కాబోతోంది. ఈ రెండు భాగాలను ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విజువల్ ఎక్స్పీరియన్స్ అందించే ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ స్కూల్ క్యాంపెయిన్ ద్వారా `రామాయణ` చిత్ర బృందం బాలీవుడ్ ప్రమోషన్స్ రంగంలోనే ఒక కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.
