చరణ్ని చూస్తే 'అప్పు'ను చూసినట్టే ఫీల్ అవుతాను: శివరాజ్ కుమార్
రామ్చరణ్ నటన, వ్యక్తిత్వంపై శివన్నకు ఎంతటి గౌరవం ఉందో ఆయన చేసిన మరో వ్యాఖ్య ద్వారా స్పష్టమవుతోంది.
By: Sivaji Kontham | 29 May 2026 11:03 PM ISTమెగా పవర్స్టార్ రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా `పెద్ది` విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ అండ్ టీమ్ ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో తలమునకలుగా ఉన్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా శివన్న.. రామ్చరణ్పై చేసిన కొన్ని ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు మెగాభిమానులు సహా ఫిలింసర్కిల్స్లో వైరల్ అవుతున్నాయి. వెండితెరపై చరణ్ను చూడటానికి అభిమానులతో పాటు తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని శివరాజ్ కుమార్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ సందర్భంగా రామ్చరణ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ శివన్న భావోద్వేగానికి గురయ్యారు. ``రామ్చరణ్ను చూసిన ప్రతిసారీ నాకు నా తమ్ముడు అప్పు (దివంగత పునీత్ రాజ్కుమార్)ను చూసినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో చరణ్తో కలిసి సీన్స్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ నా సొంత బ్రదర్తో నటిస్తున్న భావన కలిగింది. ఆ పోలికలు నన్ను తీవ్రమైన ఎమోషన్కు గురి చేశాయి! అంటూ శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. రామ్చరణ్లో ఉన్న వినయం, క్రమశిక్షణే తన తమ్ముడిని గుర్తుచేశాయని ఆయన పేర్కొన్నారు.
రామ్చరణ్ నటన, వ్యక్తిత్వంపై శివన్నకు ఎంతటి గౌరవం ఉందో ఆయన చేసిన మరో వ్యాఖ్య ద్వారా స్పష్టమవుతోంది. కన్నడ ఇండస్ట్రీలో తాను నటించి ఘనవిజయం సాధించిన విజువల్ వండర్ `భజరంగి` సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే.. ఆ పాత్రకు రామ్చరణ్ అయితేనే పక్కాగా సరిపోతాడని.. అతడు ఈ సినిమాను రీమేక్ చేస్తే చూడాలని తనకు ఆశగా ఉందని శివరాజ్ కుమార్ అన్నారు. చరణ్ మాస్ ఇమేజ్కు, పెర్ఫార్మెన్స్కు ఆ తరహా కథలు అద్భుతంగా సెట్ అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు శివన్న నటనపై మెగా పవర్స్టార్ రామ్చరణ్ సైతం ప్రశంసల జల్లు కురిపించారు. `పెద్ది` సినిమాలో కేవలం మూడు ప్రత్యేకమైన సన్నివేశాలలో శివన్న తన కళ్లతోనే అద్భుతమైన హావభావాలను, ఎమోషన్స్ను పండించారని చరణ్ కొనియాడారు. కన్నడ ఇండస్ట్రీ లెజెండ్ అయినా.. ఆయన సెట్స్లో చూపించిన చొరవ తమనెంతో ఆకట్టుకుందని తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు సన రాసిన అద్భుతమైన స్క్రిప్ట్ చూసి మోటివేట్ అయ్యామని.. అందుకే తామంతా సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగామని చరణ్ స్పష్టం చేశారు.
ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన ప్రతిభపై రామ్చరణ్ ఎంతో నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ``నా మాటలు గుర్తుపెట్టుకోండి.. రానున్న కొన్ని సంవత్సరాలలో భారతీయ చలనచిత్ర రంగంలోనే టాప్- 4 దర్శకులలో ఒకడిగా బుచ్చిబాబు నిలవడం ఖాయం`` అంటూ చరణ్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వృద్ధి సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జాన్వీ కపూర్ కథానాయిక. ఈ చిత్రం శివన్న, చరణ్ల మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.
