'మెకానికల్ ఇంజనీర్' అవుతానని అబద్ధం చెప్పేవాడిని: చరణ్
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేసిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్చరణ్ `పెద్ది` సినిమా కథాంశం గురించి కీలక విషయాలను షేర్ చేసారు.
By: Sivaji Kontham | 29 May 2026 11:04 PM ISTమెగా పవర్స్టార్ రామ్చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ యాక్షన్ డ్రామా `పెద్ది` బాక్సాఫీస్ పోరుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రమోషన్లలో భాగంగా హీరో రామ్చరణ్ తన వ్యక్తిగత జీవితానికి..`పెద్ది` సినిమా కథకు ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. చిన్నతనం నుండి మెగాస్టార్ చిరంజీవి నీడలో పెరిగినా కానీ.. ఇంట్లో అసలు సినిమా వాతావరణం ఎలా ఉండేదో చరణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాన్న (చిరంజీవి) ఎంతటి అగ్ర నటుడో.. ఎంత పెద్ద సూపర్స్టారో నాకు అస్సలు తెలిసేది కాదు. ఎందుకంటే మా ఇంట్లో సినిమా అనేది కేవలం ఇంటి మెయిన్ గేటు వరకే పరిమితం అయ్యేది.. గేటు దాటి లోపలికి వస్తే కేవలం ఒక సాధారణ కుటుంబంలాగే ఉండేవాళ్లం! అని రామ్చరణ్ పేర్కొన్నారు. అయితే లోపల నటుడు అవ్వాలనే బలమైన కోరిక ఉన్నా.. నాన్నకు ఆ విషయం చెప్పడానికి ఎంతో భయపడేవాడినని చరణ్ నవ్వుతూ వెల్లడించారు. అందుకే ఎవరైనా ఏం అవుతావని అడిగితే.. భయంతో నటుడిని అవుతానని చెప్పకుండా `మెకానికల్ ఇంజనీర్` అవుతానని అబద్ధం చెప్పేవాడినని చరణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేసిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్చరణ్ `పెద్ది` సినిమా కథాంశం గురించి కీలక విషయాలను షేర్ చేసారు. పెద్ది కథలో తన పాత్ర గురించి చెబుతూ.. ఒక గ్రామంలో ఎలాంటి ఐడెంటిటీ లేని కుర్రాడు తన గుర్తింపు కోసం ఏ ఆటకు అయినా సిద్ధపడతాడని కూడా వెల్లడించాడు. ఆటతోనే తనకు గుర్తింపు.. తన జీవనాన్ని ముందుకు నడిపించడానికి ఆటే కీలకం! అని చెప్పాడు. ఈ సినిమాలో డ్రామా ప్రధానంగా తండ్రీకొడుకుల మధ్య లేదా ఒక కుటుంబం చుట్టూ తిరిగే భావోద్వేగాలు.. తన నిజజీవితానికి చాలా దగ్గరగా అనిపించాయని చరణ్ చెప్పారు. బుచ్చిబాబు సన రాసిన ఈ కథలో కేవలం మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్కరినీ కదిలించే బలమైన ఎమోషన్స్ ఉంటాయని... అందుకే ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని చరణ్ స్పష్టం చేశారు.
వృద్ధి సినిమాస్- మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ భారీ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
రామ్చరణ్ తన చిన్ననాటి భయాలను.. నాన్నతో ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా కథతో ముడిపెడుతూ మాట్లాడటం చూస్తుంటే.. `పెద్ది` కేవలం ఒక రూరల్ యాక్షన్ డ్రామాగానే కాకుండా అద్భుతమైన ఫ్యామిలీ సెంటిమెంట్తో ప్రేక్షకులను అలరించబోతుందని అర్థమవుతోంది. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
