ఐపీఎల్ స్పెషల్: కాంపా బ్రాండ్ అంబాసిడర్గా మెగా పవర్ స్టార్
ప్రస్తుతం మిలీనియల్స్, జెన్-జె తరాల ఆడియెన్స్ను టార్గెట్ చేస్తూ ‘కాంపా వాలి జిద్’ పేరుతో ప్రత్యేక ప్రచార చిత్రాన్ని రూపొందించారు.
By: Tupaki Desk | 11 April 2025 11:32 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. వరుసగా విభిన్నమైన ప్రాజెక్ట్స్ చేస్తూనే, మరోవైపు జాతీయ స్థాయిలో పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ తన క్రేజ్ను పెంచుకుంటున్నాడు. తాజాగా ఆయనకు మరో పెద్ద కమర్షియల్ అఫిలియేషన్ దక్కింది. రిలయన్స్ గ్రూప్కు చెందిన బేవరేజెస్ బ్రాండ్ "కాంపా"కి రామ్ చరణ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.
ఈ విషయాన్ని స్వయంగా రిలయన్స్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రామ్ చరణ్తో భాగస్వామ్యం కాంపా ప్రయాణంలో ఓ రికార్డ్ గా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. దేశీయ బ్రాండ్గా నిలిచిన కాంపా, 2023లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ మార్కెట్లో తన స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన వ్యూహంలో భాగంగా రామ్ చరణ్ను ఎంపిక చేయడం ద్వారా యువతలో చేరువయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
ప్రస్తుతం మిలీనియల్స్, జెన్-జె తరాల ఆడియెన్స్ను టార్గెట్ చేస్తూ ‘కాంపా వాలి జిద్’ పేరుతో ప్రత్యేక ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రామ్ చరణ్ తన ఎనర్జీతో బ్రాండ్ మూడ్కు పూర్తిగా తగ్గిన విధంగా కనిపించబోతున్నాడు. ఈ వీడియోని ఐపీఎల్ సీజన్లో వివిధ భాషల్లో టీవీలు, మొబైల్ యాప్ల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురానున్నారు. ఇదే సమయంలో కాంపా అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశముంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా "పెద్ది" షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ ఓ గ్రామీణ యువకుడిగా కనిపించబోతున్నాడు. క్రికెట్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఫినిషింగ్ పనుల మధ్యే చరణ్ ఈ కాంపా కమర్షియల్ను పూర్తి చేశాడని తెలిసింది. ఈ మేరకు ప్రకటన విడుదలకాగానే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గతంలో కూడా రామ్ చరణ్ నూతన జెనరేషన్ బ్రాండ్లకు ప్రచారకర్తగా కనిపించాడు. స్పోర్ట్స్ షూస్, పర్ఫ్యూమ్స్, యాప్స్, ఫుడ్ డ్రింక్స్ ఇలా విభిన్న బ్రాండ్లకు తన క్రేజ్ను క్యాష్ చేసుకున్న చరణ్.. ఇప్పుడు ఐపీఎల్ లాంటి టోర్నీలలో మరో విధంగా హైలెట్ అవుతున్నాడు. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో కూల్ డ్రింక్ బ్రాండ్తో కలిసి ప్రచారం చేయడం వ్యూహాత్మకంగా మారనుంది. మొత్తానికి మెగా పవర్ స్టార్ బ్రాండ్ వాల్యూ మరోసారి మార్కెట్లో ప్రతాపం చూపించింది. కాంపా బ్రాండ్ రీఎంట్రీలో రామ్ చరణ్ అంబాసిడర్గా మారడం, ఐపీఎల్ వేదికగా ప్రచారం జరగడం, పెద్ది సినిమా షూట్ జోరుగా సాగడం ఇలా అన్ని వర్గాల్లో చరణ్ తన ప్రభావాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.