Begin typing your search above and press return to search.

వివాదంలో ర‌కుల్: సింహాలు తిరిగే చోట‌ వాహ‌నం దిగి .. అట‌వీ అధికారుల వివ‌ర‌ణ‌

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో రక్షిత అటవీ ప్రాంతం లోపల తీసింది కాదని వారు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

By:  Sivaji Kontham   |   11 May 2026 6:00 PM IST
వివాదంలో ర‌కుల్: సింహాలు తిరిగే చోట‌ వాహ‌నం దిగి .. అట‌వీ అధికారుల వివ‌ర‌ణ‌
X

బాలీవుడ్ నటులు ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ తమ త‌దుప‌రి చిత్రం `పతి పత్నీ ఔర్ వో 2` ప్రమోషన్లలో భాగంగా ఇటీవల గుజరాత్‌లోని గీర్ నేషనల్ పార్క్‌ను సందర్శించారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ సఫారీ వాహనం పక్కన నడుస్తూ కనిపించడమే ఈ వివాదానికి కారణమైంది. సాధారణంగా రక్షిత అటవీ ప్రాంతాల్లో పర్యాటకులు వాహనాల నుండి కిందకు దిగడం నిబంధనలకు విరుద్ధం కావడంతో రకుల్ వన్యప్రాణి నిబంధనలను ఉల్లంఘించారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

ఈ వివాదంపై గీర్ నేషనల్ పార్క్ అధికారులు తక్షణమే స్పందించి పూర్తి స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో రక్షిత అటవీ ప్రాంతం లోపల తీసింది కాదని వారు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సాసన్ శాంక్చురీకి వెళ్లే ప్రవేశ ద్వారం వెలుపల ఈ ఘటన జరిగిందని, అక్కడ పర్యాటకులు వాహనం దిగడంపై ఎలాంటి నిషేధం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రకుల్ నిబంధనలను ఉల్లంఘించారనే వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది.

అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా అటవీ శాఖ అధికారులు క్లుప్తంగా వివరించారు. రకుల్ ప్రీత్ సింగ్ తన టీమ్‌తో కలిసి పక్కా ప్రణాళికతోనే శాంక్చురీ సందర్శనకు వచ్చారని.. అయితే లోపలికి ప్రవేశించక ముందే త‌న‌కు స్వల్ప అనారోగ్యం త‌లెత్తిందని తెలిపారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ర‌కుల్ బృందం త‌న‌ను తిరిగి వెనక్కి తీసుకెళ్లిందని.. అసలు ఆమె అటవీ ప్రాంతం లోపలికే ప్రవేశించలేదని అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం ప్రవేశ ద్వారం దాటిన తర్వాతే కఠిన రూల్స్ అమలవుతాయని... రకుల్ విషయంలో అలాంటిదేమీ జరగలేదని వారు పునరుద్ఘాటించారు.

ఈ వివాదం పక్కన పెడితే... రకుల్ నటిస్తున్న `పతి పత్నీ ఔర్ వో 2` చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2019లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం `పతి పత్నీ ఔర్ వో`కి ఇది సీక్వెల్. 1978 నాటి ఒరిజినల్ కథకు ఆధునిక హంగులు అద్ది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈసారి ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ , వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించ‌గా, పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

చివ‌రికి రకుల్ ప్రీత్ సింగ్ గీర్ సఫారీ వీడియోపై నెలకొన్న సందిగ్ధతకు అధికారుల వివరణతో తెరపడింది. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వారి చిన్న చిన్న కదలికలు కూడా చర్చనీయాంశమవుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అటవీ శాఖ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా ఈ విషయాన్ని ధృవీకరించడంతో, రకుల్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి మే 15న విడుదల కానున్న ర‌కుల్ కొత్త సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అనే అంశంపైనే ఉంది.