రిలీజ్ కు రాజమౌళి స్పెషల్ ప్లాన్!
రాజమౌళి సినిమా అంటే ప్లానింగ్ ఉండదు. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది ఆయనే స్పష్టంగా చెప్పలేరు.
By: Tupaki Desk | 18 Jun 2025 6:00 PM ISTరాజమౌళి సినిమా అంటే ప్లానింగ్ ఉండదు. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది ఆయనే స్పష్టంగా చెప్పలేరు. కనీసం అంచనా కూడా వేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకు ప్రధాన కారణంగా షూటింగ్ అనుకున్న టైమ్ లో పూర్తి చేయగలమా? లేదా? అన్న మీమాంసలోనే రాజమౌళి రిలీజ్ డేట్ ముందే చెప్పలేరు. 'బాహుబలి2' రిలీజ్ అయిన రెండున్నరేళ్ల తర్వాత 'ఆర్ ఆర్ ఆర్' పట్టాలెక్కించారు? అంటే రాజమౌళి ప్లానింగ్ ఎలా ఉంటుంది? అన్నది ఇక్కడే అర్దమవుతుంది.
అయితే ఎస్ ఎస్ ఎంబీ 29 విషయంలో మాత్రం కాస్త ప్లాన్ డ్ గానే జక్కన్న ఉంటున్నారే వార్త వినిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చిత్రాన్ని 2027 సమ్మర్ కు రిలీజ్ చేసేలా ప్రణాళికతోనే బరిలోకి దిగారని అంటున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. ఇంకా పూర్తి కావాల్సింది చాలా ఉంది. త్వరలోనే టీమ్ కెన్యా ప్లైట్ ఎక్కనుంది. నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ ఉంటుందట. మహేష్, పృధ్వీరాజ్, ప్రియాంక చోప్రా సహా ప్రధాన తారగణమంతా కెన్యా షెడ్యూల్ లో పాల్గొంటుంది.
జులైలో కెన్యా షూటింగ్ ఉంటుందని సమాచారం. కెన్యా నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ఉంటుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెట్ రూపంలో కాశీ నగరాన్ని హైదరాబాద్ లోనే నిర్మిస్తున్నారు. అచ్చంగా ఆ సెట్ కాశీనే తలపిస్తుంది. ఈ సెట్ కోసం 60 కోట్లు ఖర్చు చేస్తున్నారుట. ఈ సెట్ లోనే నెల రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ ఉంటుందని సమాచారం.
ఈ రెండ్యూళ్ల మధ్య పెద్దగా గ్యాప్ ఉండదంటున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం మళ్లీ నెల రోజుల పాటు చిత్రీకరణకు బ్రేక్ ఇవ్వనున్నారట. తిరిగి మళ్లీ యధా విధిగా రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా రిలీజ్ 2027 వేసవిలో ఉంటుందని అంటున్నారు.
