మణిరత్నంతో మాధవన్కి చెడిందా?
బహుముఖ ప్రజ్ఞతో నిరూపించిన మేటి నటుడు దర్శకుడు ఆర్. మాధవన్. తెలుగు రాష్ట్రాల్లోను అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది.
By: Tupaki Desk | 4 April 2025 3:51 AMబహుముఖ ప్రజ్ఞతో నిరూపించిన మేటి నటుడు దర్శకుడు ఆర్. మాధవన్. తెలుగు రాష్ట్రాల్లోను అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక సాధారణ వ్యక్తి అంచెలంచెలుగా ఎదగడం ఎలానో బుల్లితెర నుంచి వచ్చిన మాధవన్ నిరూపించాడు. అయితే తన కెరీర్ను తీర్చిదిద్దిన మణిరత్నంను అతడు ఎప్పుడూ మర్చిపోడు.
ఏదో ఒక రూపంలో తన కృతజ్ఞతను చూపిస్తూనే ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన గురువు మణిరత్నం ను గుర్తు చేసుకుంటూ మ్యాడీ ఎమోషనల్ అయ్యాడు. 2000లో మణిరత్నం తెరకెక్కించిన `అలైపాయుతే`(చెలి) చిత్రంతో తమిళ చిత్ర రంగ ప్రవేశం చేశాడు. చెలి పేరుతో ఈ సినిమా తెలుగులోను విడుదలైంది. ఈ చిత్రం మ్యాడీని రొమాంటిక్ హీరోగా నిలబెట్టింది. అయితే `ఆయిత ఎళుతు`(యువ -తెలుగు) చిత్రంలో పాత్రను తిరస్కరించడంతో మణిరత్నం తో సంబంధం కొంతకాలం ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా మణిరత్నం కార్యాలయంలో సెక్యూరిటీ వాళ్లు తనను ఎలా ఆపారో మ్యాడీ చెప్పుకొచ్చారు.
నిజానికి యువ చిత్రంలో మాధవన్ రగ్గ్ డ్ గా ఉన్న పాత్రలో నటించాడు. ఆ పాత్రను మణిరత్నం మొదట్లో సిద్ధార్థ్ కు ఆఫర్ చేసారు. కానీ అది తనుకు కావాలని పట్టుబట్టి మరీ మ్యాడీ లాక్కున్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ కి అందులో లవర్ బోయ్ పాత్రను ఇచ్చారు. ఈ సినిమాలో ఇన్బా అనే మాస్ పాత్రలో మాధవన్ నటనకు గొప్ప పేరొచ్చింది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో అతడు అద్భుతంగా నటించాడు. నేను కథ విని ఇన్బా పాత్ర తప్ప ఇతర పాత్రలను మర్చిపోతారని మణిరత్నం సర్ తో అన్నాను. నా మాటలకు ఆయన బాధపడ్డారు! అని మాధవన్ వెల్లడించారు. నిజానికి ఆ పాత్ర లుక్ డిఫరెంట్ గా రఫ్ గా ఉండాలి. అందుకే మ్యాడీకి ఇచ్చేందుకు మణిరత్నం వెనకాడారు. దీంతో మాధవన్ తన రూపాన్ని మార్చుకునేందుకు నెల సమయం కోరాడు. తన రూపం కఠినంగా మారడానికి చాలా చేసాడు. ఎండలో సన్స్క్రీన్ లేకుండా గోల్ఫ్ ఆడాడు. జుత్తు కత్తిరించుకున్నాడు. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
ఈ కొత్త లుక్తో మణిరత్నం కార్యాలయానికి వచ్చాడు. కానీ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు అతన్ని గుర్తించలేకపోయారు. అతడిని లోపలికి రాకుండా ఆపారు. మణిరత్నంకు తెలిసిన వ్యక్తి కలవడానికి వచ్చాడని చెప్పారు. ఎవరో చెప్పకుండా వచ్చినందుకు మణి సార్ చాలా బాధపడ్డారు. నేను అక్కడ నిలబడి ఉండటం చూసినా.. నేను నవ్వే వరకు అది నేనేనని ఆయన గ్రహించలేదు! అని మాధవన్ గుర్తుచేసుకున్నాడు. పాత్ర కోసం రూపం మార్చుకున్న తీరుకు ఆశ్చర్యపోయిన మణిరత్నం అతడు ఇంత సీరియస్ గా ఉన్నాడా? అని అడిగారట. ఇన్బా కఠినమైనవాడు..దాదాపు జంతువు లాంటి బాల్యంతో చెడుగా ఉంటాడని చెప్పారు. దానికి తగ్గట్టు మ్యాడీ రూపం మార్చుకున్నాడు.
ఈ సినిమా తర్వాత కూడా మాధవన్ - మణిరత్నం కన్నతిల్ ముత్తమిట్టల్ - గురు చిత్రాలకు కలిసి పనిచేశారు. ఈ సినిమాల్లో నటనకు మంచి పేరొచ్చింది. మాధవన్ ఇప్పుడు సిద్ధార్థ్, మీరా జాస్మిన్, నయనతారలతో కలిసి టెస్ట్ లో నటించారు. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఏప్రిల్ 18న విడుదల కానున్న `కేసరి చాప్టర్ 2`లో కూడా మ్యాడీ కనిపించనున్నారు.