మనిషిని చూసి ఏలియన్స్ నవ్వుతాయి: పూరి జగన్నాథ్
ఆస్తులు అంతస్తులు దాచుకోవాలని ఆరాటపడి అప్పులు చేసి జీవితాంతం వాటిని తీర్చే పనిలో ఉండకు అని కూడా సలహా ఇచ్చారు.
By: Tupaki Desk | 27 April 2025 4:18 AMఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషీ ఆస్తులు పోగేయాలని అనుకుంటాడు. భూములు, సొంత ఇల్లు ఆస్తులు వగైరా వగైరా దాచుకోవాలని ఆరాటపడతాడు. అయితే ఆస్తి, ఐశ్వర్యాలను పోగేసుకుని బరువెక్కిపోవద్దని సూచిస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. మనిషి భూమ్మీదికి టూరిస్టులా వచ్చాడు. వీసా ఎప్పుడు ఎక్స్ పైరీ అవుతుందో తెలీదు. అందుకే టూరిస్ట్ మెండ్ తో ఉండు! అని సలహా ఇచ్చారు. తాజాగా పూరి మ్యూజింగ్స్ లో ఆయన అడ్వయిజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆస్తులు అంతస్తులు దాచుకోవాలని ఆరాటపడి అప్పులు చేసి జీవితాంతం వాటిని తీర్చే పనిలో ఉండకు అని కూడా సలహా ఇచ్చారు. ఆస్తులకు కాపలా ఉండొద్దని అన్నారు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా వదిలేయాలని సూచించారు. చంద్రమండలం మీద వెయ్యి ఎకరాలు కొనమంటే కొంటామా? మార్స్ గ్రహం మీద లక్ష ఎకరాలు లక్షకే ఇస్తామన్నా కొనం.. అది మోసం అని గ్రహిస్తాము. వేరే గ్రహాలకు వెళ్లినప్పుడు ఒక టూరిస్టులా ఇవాళ ఉండి తిరిగి వెళ్లిపోతాం. అదే మైండ్ సెట్ ని భూమ్మీద కూడా వర్తింపజేయండి. ఇక్కడ ఆస్తులు కొంటూ ఉంటాం. జీవితాంతం వాటికి కాపలా కాస్తూ ఉంటాం. భూమి కొనుక్కుని ఇది నాది అని ఏలియన్ మీకు చూపిస్తే మీరెలా నవ్వుకుంటారో అది కూడా అలానే నవ్వుకుంటుంది!
మనం టూరిస్టులా వచ్చాం. తక్కువ సామానుతో బతికేద్దాం. ఇల్లు పెళ్లిళ్లు మానేద్దాం. మీలో ఉన్న సంచారిని బయటికి తీయండి. ఇక్కడ ఉన్నన్ని రోజులు టూరిస్టు మైండ్ సెట్ తోనే ఉండండి. తాజ్ మహల్ , ముంతాజ్ ఎవరినైనా టూరిస్ట్ మైండ్ సెట్ తోనే చూడాలి. పోర్చుగల్ నుంచి ఇటలీ మీదుగా జర్మనీ వెళ్లాలి. మధ్యలో ఇటలీ అమ్మాయి కనిపిస్తే తాలి కట్టేస్తావా? కట్టేస్తే అక్కడే ఉంటూ అద్దెలు, అప్పులు కట్టుకుంటూ చస్తావు.
మ్యారేజ్.. మార్టిగేజ్.. సేల్ డీడ్ ఈ గొడవలన్నీ వదిలేయ్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో మాట్లాడకు. వాళ్లు మాత్రం ఇక్కడే ఉండిపోతారా? కాకిలా మారు. బ్యాక్ ప్యాక్ సర్ధుకో. ప్రయాణాలు చేయ్. ప్రకృతిని ఆస్వాధించు. అగ్రిమెంట్లు, విడాకులు అంటూ పిచ్చి పనుల్లో ఇరుక్కోకు. నువ్వు టూరిస్టువి. అలాగే ఉండు. ఈ భూమి గాల్లో తిరిగే మట్టిముద్ద. నువ్వు కట్టే ఇల్లు సహా అన్నీ మట్టిలో కలిసిపోతాయ్. ఎవరికి ఎప్పుడు డేట్ అయిపోతుందో తెలీదు. అందుకే ముందు నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో! అంటూ పూరి పూర్తిగా వేదాంతం మాట్లాడతారు.