నీల్ స్క్రీన్ ప్లే మాస్టర్ క్లాస్లో 'రామాయణం' ఎగ్జాంపుల్!
ఇంతకుముందు కేజీఎఫ్ టీజర్ లేదా ట్రైలర్.. సలార్ టీజర్ లేదా ట్రైలర్ చూడగానే అతడు సృష్టించే డార్క్ వరల్డ్, డార్క్ పాత్రలు మరోసారి గుర్తుకు వచ్చాయి.
By: Sivaji Kontham | 21 May 2026 10:54 AM ISTటాలీవుడ్ లేదా భారతీయ సినిమా కోసం మంచి కథల్ని రాయడం ఎలా? మాస్టర్ క్లాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ల కోసం అసాధారణమైన స్క్రీన్ ప్లే లు రాయడం ఎలా? మరో నోలాన్, కామెరూన్ లేదా రాజమౌళి, సుకుమార్ రేంజును అందుకోవాలంటే నేటితరం ఔత్సాహిక దర్శకరచయితలు ఎలాంటి అభ్యసనం చేయాలి? అంటే.. తాజాగా సౌతిండియా ట్యాలెంటెడ్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అతడు ఎంచుకునే డార్క్ టోన్ స్క్రిప్టు, డార్క్ షేడ్ పాత్రలను ఎలివేట్ చేయడానికి.. గ్యాంగ్ స్టర్ మాఫియా కథల్లో గ్రిప్ పెంచుకోవడానికి నిరంతరం పురాణేతిహాసాల్ని అభ్యసనం చేస్తాడని తాజా ఇంటర్వ్యూ బయటపెట్టింది. ప్రస్తుతం అతడు ఎన్టీఆర్ తో `డ్రాగన్` కోసం అహోరాత్రులు కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఈ సినిమా కథను కంటెంట్ ని మాత్రం దాచుకోకుండా ఇప్పటికే ఓపెన్ చేసేసాడు. కథేంటి, డ్రాగన్ ప్రపంచం ఏమిటో కూడా తాజాగా రిలీజ్ చేసిన సుదీర్ఘ మైన టీజర్ లో రివీల్ చేయడంతో నీల్ ఎత్తుగడ ప్రధానంగా చర్చకు వస్తోంది. తన కథ, కథన బలాన్ని ఎక్కడి నుంచి అతడు ఎత్తుకొస్తాడు? అనే సందేహం మరోసారి లేవనెత్తింది ఈ టీజర్.
ఇంతకుముందు కేజీఎఫ్ టీజర్ లేదా ట్రైలర్.. సలార్ టీజర్ లేదా ట్రైలర్ చూడగానే అతడు సృష్టించే డార్క్ వరల్డ్, డార్క్ పాత్రలు మరోసారి గుర్తుకు వచ్చాయి. ప్రతిసారీ అతడు తాను ఎంచుకున్న కథేంటో పాత్రలు ఎలా ఉంటాయో రివీల్ చేసేందుకు అతడు తెలివైన వ్యూహాన్ని అనుసరించాడు. కథను మూడో వ్యక్తి నేరేట్ చేస్తుంటే.. విజువల్స్ అందమైన కాన్వాసులో భారీతనంతో తెరపై అసాధారణంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ కి కూడా అదే ఎత్తుగడను అనుసరించాడు.
అయితే అతడు ప్రముఖ జర్నలిస్టు భరద్వాజ్ రంగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ .. పురాణేతిహాసం రామాయణం ఎగ్జాంపుల్ ని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. తాను ఎంచుకున్న డార్క్ వరల్డ్ తాలూకా అన్ని వివరాలను ముందే ప్రేక్షకులకు చెప్పేయడం అనే తెలివైన పనికి స్ఫూర్తి హాలీవుడ్ సినిమాలు లేదా ఐడియాలజీ. అదే సమయంలో `రామాయణం` నుంచి అతడి స్ఫూర్తి ఏమిటో కూడా చెప్పాడు.
రామాయణం కథ, అందులోని రాముడు, రావణుడు పాత్రలు అందరికీ ముందే తెలుసని, అయినా కూడా మనం ఆ సినిమాను థియేటర్లలో ఎమోషన్ కోసం చూస్తామని ప్రశాంత్ నీల్ చెప్పారు. అదే విధంగా ఈ సినిమా ప్రపంచాన్ని ముందే రివీల్ చేయడం వల్ల... పాత్రల పరిచయం ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి... నెక్స్ట్ టైమ్ కంటెంట్ వదిలినప్పుడు నేరుగా కథలోని డ్రామాను ఎంజాయ్ చేసే వీలుంటుందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. హాలీవుడ్లో సినిమా ట్రైలర్లలోనే కథను.. కొన్ని ముఖ్యమైన సీన్లను ముందే చూపిస్తారని.. తనలో కూడా వచ్చిన ఒక మార్పు వల్ల ప్రేక్షకులను కేవలం ఒక గ్రాండ్ సినిమా విజువల్స్తోనే కాకుండా... కథతో ఆకట్టుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
చాలామంది ట్యాలెంటెడ్ డైరెక్టర్లు ప్రత్యేకించి భారతీయ పురాణేతిహాసాలైన రామాయణం, మహాభారతం స్టడీ చేసాకే స్క్రీన్ల్ ప్లేలు, స్క్రిప్టులు రాస్తున్నారనేది జగమెరిగిన విషయం. చిన్నప్పుడు చదువుకున్న చందమామ, బాలమిత్ర, బుజ్జాయి కథల ప్రభావం కూడా దర్శకరచయితలపై ఉంటుంది. ఒక అందమైన కథను అంతే చక్కగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా పెద్ద తెరపై చూపిస్తేనే జనం ఆకర్షితులవుతారు. అరటిపండు వొలిచి తినిపించినంత సులువుగా.. చందమామ కథ చెబుతూ పసి పాపకు గోరు ముద్దలు తినిపించే తల్లి నేరేషన్ చందంగా.. ప్రతిదీ అర్థమవ్వాలి. అప్పుడే థియేటర్ లో కుర్చీపై నుంచి ప్రేక్షకుడు కదలకుండా సినిమా చూస్తాడు.
ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా తాను ఎంచుకున్న డార్క్ వరల్డ్ లోని పాత్రలను పరిచయం చేస్తూ, తాను ఎంచుకున్న కథ ఏంటో కూడా క్లియర్ కట్ గా ముందే రివీల్ చేసి ఆడియెన్ ని థియేటర్లకు రప్పించేందుకు సిద్ధం చేస్తున్నాడు. అసలు కథేంటో తెలియకపోతే థియేటర్లకు వెళ్లి ఏమీ అర్థం కాలేదు అనుకునే బాపతుగా కాకుండా మాస్ ఆడియెన్ కి ముందే కథ చెప్పేస్తున్నాడు. స్వాతంత్య్ర కాలం నాటి డార్క్ కథల్ని ఎంచుకుని చూపిస్తున్నాడు గనుక వాటి గురించి ముందే ఆడియెన్ కి అవగాహన ఉంటే థియేటర్లలో తన స్క్రీన్ ప్లేని బాగా అర్థం చేసుకుని ఎంజాయ్ చేస్తారనేది అతడి ఎత్తుగడ.
డిస్టోపియన్ ప్రపంచపు డార్క్ సినిమాలకు కథను దాచే కొద్దీ సమస్యలు ఎదురవతాయి. థియేటర్లకు వెళ్లాక కంటెంట్ ఏంటో అర్థం కాకపోతే దానినే జనం నెగిటివ్ గా ప్రచారం చేస్తారు. మౌత్ టాక్ బావుండాలంటే కథ, కంటెంట్ ఆడియెన్ కి స్పష్ఠంగా అర్థమవ్వాలి. ప్రతి సీన్ వెనక లాజిక్ ఏంటో కూడా జనం చాలా సులువుగా అర్థం చేసుకుని డిస్కస్ చేసేలా ఉండాలి. డిస్టోపియన్ కథలు కాకుండా సోషల్ సినిమాలు తీసినా ఫిక్షన్ జోడించినా.. రోబో శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ భారతీయుడు, అపరిచితుడు, రోబో, 2.ఓ లాంటి చిత్రాలను సాధారణ మాస్ ఆడియెన్ కి కూడా అర్థమయ్యేలా తెరకెక్కించారు. దానికి తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను దక్కించుకోగలిగాడు.
ట్యాలెంటెడ్ ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ ఫ్రాంఛైజీ, సలార్ ఫ్రాంఛైజీ కథలు, కంటెంట్ గురించి ముందే ప్రజల్ని ప్రిపేర్ చేసాడు. డార్క్ టోన్డ్ మాఫియా గూండారాజ్ కథల్ని ఎంచుకున్నా.. థియేటర్లలోకి వెళ్లాక ఎవరికీ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎంజాయ్ చేసారు గనుకనే 1000 కోట్ల క్లబ్ లు సాధ్యమయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ తో మరో డార్క్ స్టోరీని, డిస్టోపియన్ ప్రపంచం నేపథ్యంలో సక్సెస్ చేసేందుకు తెలివైన ఎత్తుగడతో ముందుకు సాగుతున్నాడని విశ్లేషించవచ్చు. రామాయణం, మహాభారతం నుంచి రిఫరెన్సులు తీసుకునేంత తెలివైన ఎత్తుగడ అందరు దర్శకులకు ఉండకపోవచ్చు. కానీ చాలా మంది తెలివైన శిక్షణ పొందిన దర్శకరచయితలు ఈ బేసిక్ ఫార్ములాను విస్మరించడం లేదని భావించవచ్చు.
