ప్రకాష్రాజ్ క్షమాపణ చెబుతాడా..వివాదం చేస్తాడా?
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఈ మధ్య తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వివాదాల్ని కొని తెచ్చుకుంటూ రామ్ గోపాల్ వర్మ తరహాలో నెట్టింట నిత్యం వార్తల్లో నిలిచే విధంగా ప్రవర్తిస్తున్నారు.
By: Ravindar Gorantla | 21 April 2026 2:49 PM ISTవిలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఈ మధ్య తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వివాదాల్ని కొని తెచ్చుకుంటూ రామ్ గోపాల్ వర్మ తరహాలో నెట్టింట నిత్యం వార్తల్లో నిలిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కేరళలో జరిగిన లిటరేచర్ మీట్లో పాల్గొన్న ప్రకాష్రాజ్ హిందువులు అంతా ఎంతో పవిత్రంగా భావించే రామయణంపై, శ్రీరాముడు, లక్ష్మణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లక్ష్మణుడిని శ్రీరాముడు లక్కీ..లక్కీ అని పిలుస్తాడని అవహేళన చేయడం వివాదంగా మారింది.
నెట్టింట నెటిజన్లు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మండిపడుతూ అతన్ని సినిమా వాళ్లు అవకాశాలు ఇవ్వకుండా బ్యాన్ చేయాలని కోరుతున్నారు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులని ట్యాగ్ చేస్తూ తమ తమ సినిమాల నుంచి ప్రకాష్ రాజ్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో అయితే ప్రకాష్ రాజ్ శవ యాత్రలతో పాటు దిష్టి బొమ్మలు తగలబెడుతూ శ్రీరాముని భక్తులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలని సీరియస్గా తీసుకున్న తితిదే పాలక మండలి సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి శనివారం రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
ప్రకాష్రాజ్కు లీగల్ నోటీసులు జారీ చేశారు. తిరుపతి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని లేని యెడల పరువు నష్టం కింద రూ.100 కోట్లు చెల్లించాలని ఆల్టిమేటమ్ జారీ చేశారు భాను ప్రకాష్. ఇటీవల తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన ప్రకాష్రాజ్ తన వ్యాఖ్యలని వక్రీకరించారన్నారు. నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలు దెబ్బతీశానని అంటున్నారు.
అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే తనకు ఆ అవసరం లేదు అన్నారు. వివరణ ఇచ్చే క్రమంలో ప్రకాష్ రాజ్ నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని అంటూ సంబోధించడంపై కూడా రామ భక్తులు, మిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అయితే తాజా పరిణామాల నేఫథ్యంలో ప్రకాష్ రాజ్ అంతా కోరుతున్నట్టే క్షమాపణలు చెబుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ క్షమాపణలు కోరకుంటే వంద కోట్లు పరువు నష్టం దావా కేసు పని చేస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ధోరణి చూస్తుంటే క్షమాపణలు చెప్పేలా కనిపించడం లేదు.
క్షమాపణలు చెప్పని పక్షంలో ప్రకాష్ రాజ్ ఎలాంటి సవాళ్లని ఎదుర్కోబోతున్నాడు? హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ వైఖరిపై ఎలా రియాక్ట్ కానున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం రాజమౌళి `వారణాసి`తో పాటు స్పిరిట్, గూఢచారి 2, ఫాదర్, మిరాకిల్, తత్వమసి వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే తాజా వివాదం కారణంగా ప్రకాష్ రాజ్ని తమ సినిమాల నుంచి తొలగించండి అని రాజమౌళి, సందీప్ రెడ్డి వంగలని నెటిజన్లు నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ వాదనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
