పిక్టాక్ : డార్లింగ్తో బిల్లా, యోగి ఏం చేస్తున్నట్లు..?
ఇటీవలే రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలో కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
By: Ramesh Palla | 26 Feb 2026 10:38 PM ISTపాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలో కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మొత్తానికి ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు బీజీ బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ఇంతగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ మరికొన్ని కొత్త సినిమాలకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ ను సీనియర్ దర్శకులు వివి వినాయక్, మెహర్ రమేష్ లు కలవడం చర్చనీయాంశం అయ్యింది. ప్రభాస్ హీరోగా వీరిద్దరూ గతంలో సినిమాలు చేసిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ప్రభాస్తో వివి వినాయక్ యోగి సినిమా...
యోగి సినిమా కమర్షియల్గా నిరాశ పరిచినా ప్రభాస్కి మంచి పేరు తెచ్చి పెట్టింది. తల్లి సెంటిమెంట్తో సాగే ఆ సినిమా ఇప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. అందుకే ప్రభాస్కి దర్శకుడు వినాయక్ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే ఎప్పటికప్పుడు వినాయక్ ను ప్రభాస్ కలవడం, ఇద్దరూ ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ప్రభాస్ తో యోగి సినిమా తీసిన దర్శకుడు వినాయక్ మళ్లీ ఆయనతో సినిమా చేయాలని భావించినా సాధ్యం కాలేదు. ఇద్దరి కాంబోలో మరో సినిమా కోసం చర్చలు జరిగినా కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో వినాయక్ కాంబోలో సినిమా అనేది ఉండదని, అలాంటి ఆలోచన కూడా కచ్చితంగా ఉండదని అభిమానులు, అన్ని వర్గాల వారు అంటున్నారు.
మెహర్ రమేష్ తీసిన బిల్లా సినిమాతో ప్రభాస్...
ఇక బిల్లా సినిమాతో ప్రభాస్ కి స్టైలిష్ మూవీని ఇచ్చిన మెహర్ రమేష్ ఇప్పుడు తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. రమేష్ కెరీర్ మొత్తంలో బిల్లా మాత్రమే బెస్ట్ మూవీ అంటూ ఆయన సన్నిహితులు కూడా అంటూ ఉంటారు. ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు గా నిలిచాయి. అందుకే ఆయనతో సినిమా అంటే హీరోలు, నిర్మాతలు బాబోయ్ అంటున్నారు. దాంతో ప్రభాస్ సైతం ఆయన దర్శకత్వంలో సినిమాను చేయడం సాధ్యం కాదని చాలా మంది అంటున్నారు. బిల్లా తర్వాత వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉన్నా మిర్చి, బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. కనుక ఇప్పుడు ప్రభాస్ ను మెహర్ రమేష్ మ్యాచ్ చేసే విధంగా సినిమాను తీయడం సాధ్యం కాదు. అందుకే వీరిద్దరి కాంబో దాదాపు అసాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు దర్శకులతో ప్రభాస్...
ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులతో ప్రభాస్ కలవడం, మెహర్ రమేష్ తీసిన సెల్ఫీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చర్చ మొదలైంది. మా డార్లింగ్తో ఈ బిల్లా డైరెక్టర్, యోగి డైరెక్టర్ ఏం చేస్తున్నారు అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కి ఉన్న మంచి మనసును ఉపయోగించుకుని వీరిద్దరు ఆయన్ను బుట్టలో పడేసుకుని సినిమాలు చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటోను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రభాస్ తో ఈ ఇద్దరు దర్శకులు సినిమాలు చేసే అవకాశం లేదు, కానీ గతంలో వీరితో సినిమాలు చేసిన కారణంగా ఆ అనుబంధం కొనసాగుతుంది. అందుకే ఇప్పుడు ఇలా కలిసి ఉంటారు అనేది చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫోటోను మీరు ఒక లుక్కేయండి.
