డార్లింగ్ మళ్లీ ఆ తప్పెందుకు చేస్తాడు?
వీరిద్దరి కాంబినేషన్ లో రీసెంట్ గా సంక్రాంతికి ది రాజా సాబ్ రిలీజవగా, ఆ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Feb 2026 4:00 AM ISTసినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు సెట్ అవుతున్నాయంటే అందరికీ షాకింగ్ గా ఉంటుంది. కొన్ని సార్లు ఊహించని కాంబినేషన్లు ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని సార్లు డిజాస్టర్ కాంబినేషన్లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో సెట్ అవుతుందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వచ్చిన ది రాజా సాబ్
ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి. వీరిద్దరి కాంబినేషన్ లో రీసెంట్ గా సంక్రాంతికి ది రాజా సాబ్ రిలీజవగా, ఆ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అలాంటి వీరిద్దరి కలయికలో ఇప్పుడు మరో సినిమా వస్తుందని తెలిసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
రాజా సాబ్ వద్దని చెప్పిన ప్రభాస్ ఫ్యాన్స్
వాస్తవానికి ది రాజా సాబ్ సినిమాకు ముందు కూడా మారుతితో సినిమా వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో గోల చేశారు. మారుతితో సినిమా వద్దంటే వద్దని ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేశారు. అయితే ప్రభాస్ మాత్రం మారుతిపై, కథపై నమ్మకముంచి ది రాజా సాబ్ ను పూర్తి చేశారు. కానీ రాజా సాబ్ రిలీజ్ తర్వాత మాత్రం ప్రభాస్ డెసిషన్ తప్పని తేలింది.
టెన్షన్ పడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్
మారుతి ఖాతాలో సక్సెస్ఫుల్ సినిమాలున్నప్పటికీ, అతను ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేసింది లేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇప్పటికైనా లోకల్ డైరెక్టర్లకు కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న పెద్ద డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్న నేపథ్యంలో మారుతితో మరోసారి సినిమా అనేసరికి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
ప్రభాస్ హీరోగా, హోంబలే ఫిల్మ్స్ సంస్థలో సినిమా రానుందని వార్తలొస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ రూమర్లు మాత్రమేనని వెల్లడించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్, కొత్తగా ఎలాంటి సినిమాలనూ ఒప్పుకోలేదని, ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే దిశగా డార్లింగ్ వర్క్ చేస్తున్నారని అతని సన్నిహిత వర్గాలంటున్నాయి.
