పొంగులేటి బయోపిక్.. హీరోగా ఎవరో తెలుసా?
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవితం వెండితెరపైకి రానుంది.
By: A.N.Kumar | 19 Sept 2025 3:25 PM ISTతెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవితం వెండితెరపైకి రానుంది. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్కు 'శ్రీనన్న అందరివాడు' అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో పొంగులేటి పాత్రలో సీనియర్ నటుడు సుమన్ నటించనున్నారు.
పొంగులేటి జీవితం.. సినిమాగా:
పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత జీవితం, ఆయన రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు, సవాళ్లు, ప్రజలతో ఆయనకున్న అనుబంధం వంటి అంశాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల గుండెల్లో 'శ్రీనన్న'గా నిలిచిన పొంగులేటి ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఆయన సాధించిన విజయాలు, కష్టాలు, ప్రజల మనిషిగా ఆయన ఎదిగిన తీరు ఈ చిత్రంలో ప్రధాన ఘట్టాలుగా ఉండనున్నాయి.
*సుమన్ ప్రధాన పాత్రలో..
ఈ బయోపిక్లో కీలకమైన పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషిస్తుండడం విశేషం. దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుమన్, పొంగులేటి పాత్రలో జీవించి పోషిస్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది. సుమన్ తన నటనతో పొంగులేటి బయోపిక్కు కొత్త శక్తిని తీసుకువస్తారని మేకర్స్ భావిస్తున్నారు.
చిత్ర బృందం వివరాలు
ఈ చిత్రానికి బయ్యా వెంకట నర్సింహ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సంగీతానికి, సాహిత్యానికి తెలుగులో మంచి పేరున్న కాసర్ల శ్యాం ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. ప్రజల మనసులను తాకేలా, స్ఫూర్తిని నింపేలా ఆయన సాహిత్యం ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. త్వరలోనే ఈ బయోపిక్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో సుమన్, దర్శకుడు, రచయితతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
