Begin typing your search above and press return to search.

పెద్దికి ఏపీ సర్కార్ బూస్ట్.. మరి తెలంగాణ సంగతేంటి?

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ది చిత్రానికి టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోలకు అనుమతి ఇవ్వగా.. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

By:  M Prashanth   |   30 May 2026 4:15 PM IST
పెద్దికి ఏపీ సర్కార్ బూస్ట్.. మరి తెలంగాణ సంగతేంటి?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ది చిత్రానికి టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోలకు అనుమతి ఇవ్వగా.. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.



సినిమా విడుదలకు ముందు రోజు జూన్ 3న రాత్రి 8 గంటల నుంచి ఏపీలో ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రత్యేక షోల టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించింది. అలాగే సినిమా విడుదలైన తర్వాత 10 రోజుల పాటు మల్టీప్లెక్స్ టికెట్లపై రూ.125, సింగిల్ స్క్రీన్ టికెట్లపై రూ.100 ఎక్స్ ట్రాగా వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చింది.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాల విడుదల సమయంలో తొలి వారంలో టికెట్ ధరల పెంపు, ఎక్స్ ట్రా షోలకు అనుమతి రావడం వల్ల నిర్మాతలకు భారీ ఆదాయం వస్తుంది. పెద్ది విషయంలో కూడా అదే జరుగుతుందని ఇప్పుడు అంతా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తొలి వీకెండ్ లోనే భారీ వసూళ్లు సాధించాలన్న టార్గెట్ తో ఇప్పుడు మూవీ టీమ్ ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోంది.

అయితే తెలంగాణలో పరిస్థితిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి కోరుతూ పెద్ది ప్రెజెంటింగ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ ను రీసెంట్ గా ఆశ్రయించినట్లు సమాచారం. కానీ టికెట్ ధరల పెంపునకు సంబంధించిన పలు అంశాలు ఇప్పటికే కోర్టు పరిధిలో ఉండటంతో ఉత్తర్వులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని కోర్టు అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ తమ పిటిషన్‌ ను వెనక్కి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే తెలంగాణలో పెద్ది సాధారణ టికెట్ ధరలతోనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు తీసుకునే నిర్ణయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్దిలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. విజయనగరం బ్యాక్ డ్రాప్ తో క్రికెట్, కుస్తీ, అథ్లెటిక్స్‌ లో రాణించే గ్రామీణ యువకుడి జర్నీని ఆ చిత్రం చూపించనుంది. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో చిత్రానికి ఆ రాష్ట్రంలో ఎక్స్ ట్రా బూస్ట్ లభించినా, తెలంగాణలో టికెట్ ధరల అంశంపై నిర్ణయం ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.