Begin typing your search above and press return to search.

నిర్మాతలతో పవన్ భేటీ.. కీలక నిర్ణయం తీసుకున్నారా?

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. తన పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో ఆయా సినిమాల నిర్మాతలతో పవన్ భేటీ అయినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   23 April 2025 11:32 PM IST
నిర్మాతలతో పవన్ భేటీ.. కీలక నిర్ణయం తీసుకున్నారా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఫుల్ బిజీగా మారడం వల్ల ఆ మూడు సినిమాలు హోల్డ్ లోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎవరూ చెప్పలేనంతగా పరిస్థితి మారిందని చెప్పాలి.

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. తన పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో ఆయా సినిమాల నిర్మాతలతో పవన్ భేటీ అయినట్లు సమాచారం. ఆ సమావేశంలో నిర్మాతలు ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు పాల్గొనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సినిమాల రిలీజ్ పై చర్చించినట్లు వినికిడి.

కొన్నేళ్ల క్రితం మొదలై ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు మూవీ.. ఇంకా పూర్తి అవ్వలేదన్న విషయం తెలిసిందే. మే 9న సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. దీంతో మరోసారి మూవీ వాయిదా పడుతోందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు.

అయితే హరిహర వీరమల్లు మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయినట్లు.. నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. సీక్వెల్ కూడా త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. మరోవైపు.. హరిహర వీరమల్లు కాకుండా సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా పెండింగ్ ఉన్నాయి.

ఓజీ మూవీ షూటింగ్ జూలై కల్లా పూర్తి చేస్తానని పవన్ హామీ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధం అవ్వమన్నారట పవన్. దీంతో డీవీవీ దానయ్య.. ఓకే చెప్పారని వినికిడి. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కు జులై నెల నుంచి డేట్స్ కేటాయిస్తానని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధులకు హామీ ఇచ్చారట.

అయితే నిర్మాతలతో జరిగిన భేటీలో పవన్ కళ్యాణ్ కీలకమైన కామెంట్స్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ తన చివరి సినిమా కావచ్చని పవన్ సంకేతాలు ఇచ్చినట్లు ఓ రేంజ్ లో వార్త వైరల్ అవుతున్నాయి. అది నిజమో కాదో తెలియకపోయినా వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. మొత్తానికి పవన్ సినిమాల విషయంలో అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అలా వచ్చే ఏడాది కాలంలో పవన్ పెండింగ్ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయన్నమాట.