దేశ గర్వాన్ని తెరపైకి తీసుకొస్తున్న అగ్నిహోత్రి
బాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టబడింది. ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ మరియు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి ఆపరేషన్ సిందూర్ అనే సినిమాను అనౌన్స్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 26 March 2026 12:56 PM ISTబాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టబడింది. ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ మరియు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి ఆపరేషన్ సిందూర్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. భారత సైన్యం నిర్వహించిన కీలక సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించిన నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా భారతదేశం.. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన లక్ష్యబద్ధ దాడులకు ప్రేరణగా రూపొందుతున్నదని నిర్మాతలు తెలిపారు. ముఖ్యంగా 2025లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఈ సినిమాకు ప్రధాన నేపథ్యంగా నిలుస్తోంది. ఆ దాడిలో 26 మంది నిరపరాధులు, ముఖ్యంగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది.
ఆపరేషన్ సిందూర్ బుక్ ఆధారంగా సినిమా
ఈ సినిమా ఆపరేషన్ సిందూర్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకం ఆధారంగా రూపొందనుంది. ఈ పుస్తకాన్ని భారత సైన్యంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ K.J.S. దిల్లాన్ రచించారు. ఇందులో భారత సైన్యం చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ల వివరాలు, వాటి వెనుక ఉన్న వ్యూహాత్మక ఆలోచనలు విశ్లేషణాత్మకంగా వివరించబడ్డాయి. ఈ సినిమాను టీ సిరీస్ మరియు ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. దేశ భద్రత, సైనిక ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యం వంటి అంశాలను ప్రతిబింబించేలా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం వెల్లడించింది.
కథలే మనల్ని ఎంచుకుంటాయి
ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ, కొన్ని కథలు మనం ఎంచుకోము, అవే మనల్ని ఎంచుకుంటాయి. ఆపరేషన్ సిందూర్ అలాంటి కథే. దేశం ఇలాంటి కీలక సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు వాటిని నిజాయితీగా డాక్యుమెంట్ చేయడం చాలా అవసరమని పేర్కొనగా, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, ఈ సినిమా కేవలం వినోదం కోసం కాకుండా, దేశం ఎదుర్కొన్న ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.
భారత సాయుధ దళాల వివిధ విభాగాలతో కలిసి ఎన్నో రోజుల పాటూ పరిశోధనలు చేశామని, ప్రజలకు తెలిసిన దానికంటే ఈ సంఘటన వెనుక ఉన్న వాస్తవాలు మరింత సంక్లిష్టంగా ఉంటాయని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ఆల్రెడీ ది కశ్మీర్ ఫైల్స్, ది టష్కెంట్ ఫైల్స్ లాంటి రియల్ లైఫ్ సంఘటనల ఆధారిత సినిమాలతో గుర్తింపు పొందిన వివేక్ అగ్నిహోత్రి, మరోసారి సున్నితమైన కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.
