ఆంధప్రదేశ్ లో OG.. టైమింగ్స్ ఛేంజ్..
ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితం మొదలవ్వగా.. ఫుల్ జోష్ లో జరిగాయి.
By: M Prashanth | 23 Sept 2025 10:48 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ (They Call Him OG) మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. ముందు రోజు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.
ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల క్రితం మొదలవ్వగా.. ఫుల్ జోష్ లో జరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మేకర్స్ బెనిఫిట్ షోలు వేయాలనుకున్నారు. మేకర్స్. అందుకు గాను ఇప్పటికే రెండు రాష్ట్రాల సర్కార్ల నుంచి జీవోలు అందుకున్నారు. కానీ రీసెంట్ గా మళ్లీ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
నిజానికి రెండు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 25న తెల్లవారుజామున ఒంటి గంటలకు ప్రీమియర్స్ వేయాలనుకున్నారు మేకర్స్. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే చెప్పింది. జీవో కూడా జారీ చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదు. సెప్టెంబర్ 24వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రీమియర్ వేయడానికి ఛాన్స్ ఇచ్చింది.
దీంతో మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ప్రత్యేక షోలు వేయడానికి మొగ్గు చూపలేదు. ఏపీలో స్పెషల్ షో సెప్టెంబర్ 24న వేసుకునేలా సవరించి జీవోను మళ్లీ జారీ చేయాలని మేకర్స్ అభ్యర్థించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్.. తాజాగా సవరించిన జీవోను జారీ చేసింది. స్పెషల్ షో సమయంలో మార్పులు చేసింది.
సెప్టెంబర్ 25న అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో, 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శనకు అవకాశం కల్పించింది. టికెట్ ధరను రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా ఇప్పటికే ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి ఏపీ సవరించిన జీవో వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంతా ఒకేసారి సినిమాను చూడనున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, సిరి లెళ్ల తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం సమకూర్చారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి గ్రాండ్ గా నిర్మించారు.
