Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌, నీల్‌ ప్రాజెక్ట్‌లో కొత్త ఎంట్రీ...!

ఎన్టీఆర్ హోం బ్యానర్‌ అయిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 12:06 PM IST
Tseries Will Join In Dragon Movie
X

కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'డ్రాగన్‌' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ లేకుండా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను ముగించిన ప్రశాంత్‌ నీల్ కొత్త షెడ్యూల్‌ను ఇటీవలే కర్ణాటకలోని మంగళూరులో ప్రారంభం అయింది. ఇదే షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ జాయిన్ కాబోతున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ సమయంలో కన్ఫర్మ్‌ అయిన ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధం అయింది. షూటింగ్ ప్రారంభంకు ముందు నిర్మాణంలో నందమూరి కళ్యాణ్ రామ్‌ బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్ జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ హోం బ్యానర్‌ అయిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నిర్మాణంలో మరో ప్రొడక్షన్‌ హౌస్‌ జాయిన్‌ అయిందనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టి సిరీస్‌ 'డ్రాగన్‌' సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా నిర్మాతగా పేరు ఉండనప్పటికీ నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ను తీసుకుని భారీ మొత్తంలో ఈ సినిమాలో పెట్టుబడి పెట్టేందుకు గాను టి సిరీస్‌ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఒప్పందాలు దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ అడిగిన సమయంలో మైత్రి మూవీ మేకర్స్‌ ఈ ఒప్పందాన్ని టి సిరీస్ ముందు పెట్టారని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబో మూవీకి ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని, సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అనే ధీమాను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ 2, సలార్‌ 1 సినిమాలు వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న ఈ సినిమా సైతం ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలీవుడ్‌ మేకర్స్ ఈ సినిమా నిర్మాణంలో జాయిన్ కావడంతో ప్రొడక్షన్‌ వ్యాల్యూ మరింతగా పెరగడంతో పాటు, అన్ని విధాలుగా సినిమా హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో ఉండటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రశాంత్‌ నీల్‌ తన గత మూడు సినిమాల ఫలితంతో ఎన్టీఆర్‌ డ్రాగన్‌ కోసం దేశం మొత్తం ఎదురు చూసేలా చేశారు. ఎన్టీఆర్‌ గత చిత్రం దేవర సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబో మూవీ కోసం దాదాపు ఐదేళ్లుగా అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్‌ ఆలస్యం కావడంతో ఆ తేదీకి విడుదల చేయడం సాధ్యం కాదని తేలిపోయింది.

2026 సమ్మర్‌ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రుక్మిణి వసంత్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రశాంత్‌ నీల్‌ గత చిత్రాల బడ్జెట్‌తో పోల్చితే ఈ సినిమా బడ్జెట్‌ ఎక్కువగా ఉండబోతుందని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.