చిరుకు 'ఇంద్ర' సెంటిమెంట్..నితిన్కు సంకటం!
అయితే అది కూడా కుదిరేలా కనిపించడం లేదు. కారణం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'విశ్వంభర' కూడా అదే రోజు బరిలోకి దిగుతోంది.
By: Tupaki Desk | 15 May 2025 4:15 PMహీరో నితిన్ పరిస్థితి ప్రస్తుతం సంకటంగా మారింది. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కల్యాణం వంటి వరుసగా మూడు ఫ్లాపుల తరువాత 'భీష్మ'తో హిట్ అందున్నాడు. ఈ సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు కావస్తున్నా నితిన్కు సక్సెస్ అందని ద్రాక్షగా మారింది. 'భీష్మ' తరువాత వరుసగా ఆరు సినిమాలు చేశాడు. అందులో ఏది కూడా హిట్ అనిపించుకోలేకపోయింది. ఈ మధ్య విడుదలైన 'రాబిన్ హుడ్' అయినా తనకు హిట్టిస్తుందని ఆశపడ్డాడు.
కానీ నో యూజ్. వెంకీ కుడుముల డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ నెలల తరబడి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నితిన్కు చేదు అనుభవాన్నే మిగిల్చి షాక్ ఇచ్చింది. రూ.60 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే దీనికొచ్చిన మొత్తం కేవలం రూ.14 కోట్లే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నితిన్ తనని 'తమ్ముడు' మాత్రమే కాపాడాలని ఈ ప్రాజెక్ట్పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో నటి లయ రీఎంట్రీ ఇస్తోంది.
తనకు కూడా ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సోలోగా బరిలోకి దిగాలని ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే జూలై 4న రిలీజ్ చేస్తున్నామంటూ దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక వీడియోని కూడా విడుదల చేశారు. కానీ సీన్ మారింది. అదే రోజు విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ 'కింగ్డమ్' రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నితిన్ 'తమ్ముడు' రిలీజ్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ డేట్ని పక్కన పెట్టి జూలై 24న బరిలోకి దిగాలని ప్లాన్ చేసుకున్నారు.
అయితే అది కూడా కుదిరేలా కనిపించడం లేదు. కారణం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'విశ్వంభర' కూడా అదే రోజు బరిలోకి దిగుతోంది. గత కొన్ని రోజులుగా రిలీజ్ డేట్ విషయంలో అయోమయంలో ఉన్న టీమ్ ఫైనల్గా చిరు 'ఇంద్ర' రిలీజ్ అయిన సెంటిమెంట్ డేట్ని ఫైనల్ చేస్తున్నారట. చిరు ఇప్పటికే ఈ డేట్ని ఫైనల్ చేసి టీమ్కు చెప్పేశాడట. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. దీంతో నితిన్ 'తమ్ముడు'కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఆ డేట్ని కూడా వదులుకోక తప్పని పరిస్థితి.
పోనీ చిరు కోసం డేట్ మార్చుకుని ఆగస్టుకు వెళదామంటే ఆగస్టులో ఎన్టీఆర్, హృతిక్ల 'వార్ 2', సూపర్ స్టార్ రజనీ 'కూలీ' సినిమాలు ఆగస్టు 14నే వచ్చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తేల్చుకోలేని అయోమయ స్థితిలో 'తమ్ముడు' టీమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ పోటీ లేకుండా సినిమాని రిలీజ్ చేయాలంటే 'తమ్ముడు' టీమ్కు ఆగస్టు ఫస్ట్ వీక్ పర్ఫెక్ట్ మరి ఆ సమయాన్ని వినియోగించుకుంటారా? లేక మరో డేట్కి వెళతారా అన్నది వేచి చూడాల్సిందే.