భారతదేశ అతిపెద్ద బ్యాంక్ స్కామ్ పై సినిమా!
భారతదేశంలోని అతి పెద్ద బ్యాంక్ స్కామ్ల్లో ఒక్కటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంను సినిమా రూపంలో తీసుకు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.
By: Tupaki Desk | 21 April 2025 5:15 PM ISTభారతదేశంలోని అతి పెద్ద బ్యాంక్ స్కామ్ల్లో ఒక్కటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంను సినిమా రూపంలో తీసుకు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్కు ఏర్పాట్లు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఎలా మోసం చేశారు, ఏ విధంగా లెక్కకు మించిన అప్పును బ్యాంక్ నుంచి తీసుకున్నారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నీరవ్ మోడీని విచారించేందుకు దేశ ఆర్థిక నేరాల విచారణ సంస్థలు రెడీ అవుతున్నాయి. ఇప్పటి వరకు బ్యాంక్ మోసాలు, ఆర్థిక నేరాలపై చాలా సినిమాలు వచ్చాయి.
నీరవ్ మోడీ జీవిత చరిత్రను చూపిస్తూనే ఆయన వ్యాపారాలకు సంబంధించిన విషయాలను చూపించబోతున్నారు. నీరవ్ జీవిత చరిత్ర ఆధారంగా పవన్ సి లాల్ రాసిన 'ఫ్లాల్డ్ : ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ డైమండ్ మొఘల్ నీరవ్ మోదీ' అనే పుస్తకం ఆధారంగా నెట్ఫ్లిక్స్ సినిమాను రూపొందించే బాధ్యతను ప్రముఖ దర్శకుడు పలాష్ వాస్వానీకి అప్పగించారని తెలుస్తోంది. నీరవ్ జీవితం బ్యాంక్ స్కాంకి ముందు ఆదర్శంగా సాగింది. ఆయన తన వ్యాపారంను వృద్దిలోకి తీసుకు వచ్చిన విధానం కచ్చితంగా ప్రతి ఒక్కరికీ ఆదర్శం అంటారు. అలాంటి నీరవ్ మోడీ తన వ్యాపారాన్ని విస్తరించడం కోసం ఎంపిక చేసుకున్న మార్గం వల్ల అసలు సమస్య వచ్చిందని అంటారు.
ఇప్పటి వరకు నీరవ్ మోడీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. అన్ని విషయాల గురించి బుక్లో వివరించినప్పటికీ ఇప్పుడు సినిమా రాబోతున్న నేపథ్యంలో మరింత మందికి ఈ విషయాలు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నీరవ్ మోడీ గురించిన పలు విషయాలను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట ఈ సినిమాను వెబ్ సిరీస్గా తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సినిమాగా నీరవ్ మోడీ జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నెట్ఫ్లిక్స్ భావిస్తుందట. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్గా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం అందుతోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను రూ.13 వేల కోట్లకు మోసం చేశారని 2018లో నీరవ్ మోడీ పై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆయన దేశం విడిచి వెళ్లి పోయారు. ఆయనను ఇండియాకు తీసుకు వచ్చేందుకు ఆర్థిక నేరాల విచారణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం నీరవ్ మోడీ బ్రిటన్ జైల్లో ఉన్నాడు. ఆయన్ను ఇండియాలో విచారించేందుకు బ్రిటన్ అధికారులతో మన అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడిన నీరవ్ మోడీ జీవిత చరిత్రను పలాష్ దర్శకత్వంలో నెట్ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
