ఎన్టీఆర్ బావమరిది.. వదిలేసి మంచి పని చేశాడు!
నార్నె నితిన్ తొలి చిత్రంగా విడుదలైన మ్యాడ్ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Jun 2025 4:59 AMకొత్త హీరోలు కెరీర్ ఆరంభంలో చేసిన ఏదైనా సినిమా రిలీజ్కు నోచుకోక ఆగిపోవడం.. ఈలోపు వేరే సినిమాలు హిట్టయి వాళ్ల రేంజ్ మారిపోవడం.. ఆ తర్వాత ఆ ఆగిన సినిమా తెరపైకి రావడం.. దాన్ని ఆ హీరోలు లైట్ తీసుకోవడం.. చాలా సందర్భాల్లో జరిగింది. హీరోకు క్రేజ్ పెరిగాక దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు కానీ... దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
ఇప్పుడు ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ విషయంలోనూ అదే జరిగింది. అతడి తొలి సినిమాగా విడుదల కావాల్సిన శ్రీశ్రీశ్రీ రాజావారు.. ఎన్నో ఏళ్లు మరుగున పడి, ఈ శుక్రవారం విడుదలైంది. కానీ అది రిలీజవుతున్న సంగతే జనాలకు తెలియదు. చూసిన జనాలు కూడా పెదవి విరుస్తున్నారు. విడుదలైందే పరిమిత థియేటర్లలో. వాటిలోనూ ఆక్యుపెన్సీలు లేవు.
ఈ చిత్రాన్ని శతమానం భవతితో జాతీయ అవార్డు సాధించిన సతీశ్ వేగేశ్న రూపొందించడం విశేషం. కానీ శతమానం భవతి తర్వాత పూర్తిగా ఫామ్ కోల్పోయిన సతీశ్.. ఈ చిత్రంలోనూ అదే ఫామ్ను చూపించారు. రొటీన్ కథ.. ఆసక్తి రేకెత్తించని కథనంతో నీరసం తెప్పించేశారని చూసిన ప్రేక్షకులు అంటున్నారు.
నార్నె నితిన్ తొలి చిత్రంగా విడుదలైన మ్యాడ్ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడి నుంచి వచ్చిన ఆయ్, మ్యాడ్ స్క్వేర్ కూడా ఘనవిజయం సాధించాయి. నితిన్ క్యామియో రోల్ చేసిన సింగిల్ సైతం బాగా ఆడింది. ఈ సినిమాల పేర్లను పోస్టర్ల మీద వేసి.. వాటి హీరో నటించిన చిత్రం అంటూ ప్రచారం చేసుకుంది శ్రీశ్రీశ్రీ రాజావారు టీం. అయినా ప్రేక్షకులు ఈ సినిమా వైపు చూడలేదు.
ఓ మలయాళ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మీద నితిన్కు ముందు నుంచే నమ్మకం లేనట్లుంది. అందుకే దీన్ని పక్కన పెట్టేశాడు. వేరే చిత్రాల్లో నటించాడు. అవి మంచి ఫలితాన్నందుకున్నాయి. ఎట్టకేలకు శ్రీశ్రీశ్రీ రాజావారును రిలీజ్ చేస్తుంటే.. ఆ చిత్రాన్ని నితిన్ ఓన్ చేసుకోలేదు. ప్రమోషన్లకు రాలేదు. దాని గురించి ఒక ట్వీట్ కూడా వేయలేదు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను పట్టంచుకోలేదు. సినిమా ఎలా ఉన్నా కాస్త ప్రమోట్ చేయాల్సిందని కొందరంటుంటే.. దీన్ని అలా వదిలేయడమే మంచిదైందని కొందరంటున్నారు.