పారడైజ్ కి పాన్-ఇండియా రేసులో భారీ పోటీ!
తమిళనాడు మాత్రమే కాదు. మాలీవుడ్ మార్కెట్లో కూడా `పారడైజ్` చిత్రానికి పెను సవాల్ తప్పడం లేదు.
By: Srikanth Kontham | 30 May 2026 11:51 PM ISTనేచురల్ స్టార్ నానికి ఇంకా సరైన పాన్ ఇండియా హిట్ పడలేదు. `దసరా`తో ఓ అటెంప్ట్ చేసాడు గానీ అది రీజనల్ గానే కనెక్ట్ అయింది. పాన్ ఇండియాలో అనుకున్నంత గొప్ప ఫలితాలు సాధించలేదు. కానీ `దసరా` విజయం మాత్రం నాని కెరీర్ లో ఓ మైలు రాయి అనే చెప్పాలి. అదే కాన్పిడెన్స్ తో మరోసారి శ్రీకాంత్ ఓదెలతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తోన్న్ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో `ది ప్యారడైజ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నాని కెరీర్లోనే అత్యధికంగా 150 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న చిత్రమిది.
ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఈ ఈ హై-వోల్టేజ్ చిత్రంతో నాని పాన్-ఇండియా స్థాయిలో తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకోవాలని పక్కా ప్లానింగ్తో ఉన్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజే ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడమే టార్గెట్ గా చిత్ర బృందం ప్రమోషన్స్, థియేట్రికల్ ప్లానింగ్ను సిద్ధం చేస్తోంది. మీడియం రేంజ్ హీరో స్థాయి నుండి గ్లోబల్ లీగ్లోకి అడుగుపెడుతున్న నానికి 100 కోట్ల ఓపెనింగ్స్ టార్గెట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా చెప్పొచ్చు.
అయితే ఈ కలల రికార్డును అందుకోవడం అంత సులువు కాదని ఇండస్ట్రీ సమీకరణాలు చెప్తున్నాయి.`పారడైజ్` విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందు అంటే ఆగస్టు 14న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ మూవీ `విశ్వనాథ్ అండ్ సన్స్` థియేటర్లలోకి రానుంది. వారం రోజుల గ్యాప్ ఉన్నప్పటికీ ఇప్పటికే `కరుపు` చిత్రంతో 250 కోట్ల క్లబ్లో చేరిన సూర్య బాక్సాఫీస్ రేంజ్ తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఉంటుంది. ఆగస్టు 21 నాటికి కూడా తమిళ మార్కెట్లో సూర్య సినిమా హోల్డ్ బలంగా ఉండే అవకాశం ఉండటంతో నాని చిత్రానికి అక్కడ థియేటర్ల కేటాయింపు - ఓపెనింగ్స్ పరంగా గట్టి పోటీ తప్పేలా లేదు.
తమిళనాడు మాత్రమే కాదు. మాలీవుడ్ మార్కెట్లో కూడా `పారడైజ్` చిత్రానికి పెను సవాల్ తప్పడం లేదు. ఈ సినిమా విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే ఆగస్టు 20న మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవేటెడ్ మూవీ `ఐయామ్ గేమ్`, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న`ఖలీఫా` చిత్రాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో కేరళ బాక్సాఫీస్ వద్ద ఉత్కంఠ నెలకొంది.
ఈ రెండు భారీ మలయాళ చిత్రాల పోటీ కారణంగా కేరళ వ్యాప్తంగా ఉన్న ప్రధాన థియేటర్లు, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అన్నీ స్థానిక సినిమాలకే దక్కే అవకాశం ఉంది. దీంతో ఆగస్టు 21న రిలీజ్ అయ్యే `పారడైజ్` చిత్రానికి మలయాళ మార్కెట్లో ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకడం కష్టమే. అదే జరిగితే ఓపెనింగ్ డే కలెక్షన్లపై కూడా తీవ్ర ప్రభావం తప్పదు. పాన్-ఇండియా స్థాయిలో 100 కోట్లు మొదటి రోజు సాధించాలంటే సౌత్ లోని అన్ని భాషల నుండి భారీ కాంట్రిబ్యూషన్ అవసరం. కానీ సన్నివేశం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
