'బైకర్' పై కింగ్ సైజ్ పోస్ట్..రీజన్ అదా?
శర్వానంద్ కథానాయకుడిగా యాంగ్రీ యంగ్మెన్ డా. రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన మోటో క్రాస్ రేసింగ్ మూవీ `బైకర్`.
By: Ravindar Gorantla | 4 April 2026 11:09 PM ISTశర్వానంద్ కథానాయకుడిగా యాంగ్రీ యంగ్మెన్ డా. రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన మోటో క్రాస్ రేసింగ్ మూవీ `బైకర్`. ఈ మూవీ ద్వారా అభిలాష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. `బైకర్` బాగుందంటూనే ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ని షేర్ చేశారు.
`కుటుంబ బంధాలు, భావోద్వేగాలను అందంగా ఆవిష్కరించిన చిత్రం `బైకర్`. రేసింగ్ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎంతో అద్భుతంగా దీర్చిదిద్దారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. మనసుని హత్తుకునే ఇలాంటి కథాంశాన్ని ఇంత పరిణతితో రూపొందించిన దర్శకుడు అభిలాష్ మా అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీ విద్యార్థి అని తెలిసి గర్వపడుతున్నా. టీమ్ అందరికి ఇవే నా అభినందనలు` అని పోస్ట్ చేశారు. నాగ్ ఈ మూవీ పై స్పందించడంతో ముందు చాలా మంది కారణం ఏదై ఉంటుందా? అని ఆరా తీశారు.
అయితే అభిలాష్ రెడ్డి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్టూడెంట్ కావడం వల్లే కింగ్ స్పందించాడని తెలియడంతో అంతా అవాక్కవుతున్నారు. అంతే కాకుండా ఇందులో శర్వాతో పాటు డా. రాజశేఖర్ కీలక పాత్రలో నటించాడన్న విషయాన్ని కింగ్ నాగార్జున ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే నాగార్జున స్పందనపై డైరెక్టర్ అభిలాష్ రెడ్డి స్పందించాడు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. థాంక్యూ సర్ మీ మాటలు ఎంతో విలువైనవని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్టూడెంట్గా మీ నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ప్రత్యేకంగా ఉందన్నాడు.
ఈ విషయం పక్కన పెడితే.. కింగ్ నాగార్జున ప్రస్తుతం సైలెంట్గా తన వందవ సినిమాని మొదలు పెట్టి చకచక షూటింగ్ జరుపుతున్నారు. రా కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ చాలా ప్రత్యేకంగా ఉండేలా నాగార్జున జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పటకే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ ప్రాజెక్ట్ లో టబు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దాదాపు 23 ఏళ్ల విరామం తరువాత మళ్లీ నాగ్, టబు కలిసి నటిస్తుండటం, డీఏజింగ్ టెక్నాలజీ కారణంగా నాగార్జున 25 ఏళ్ల యువకుడిగానూ, 60 ఏళ్ల ఓల్డ్మెన్గానూ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మొదలయ్యాయి.
తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్, సుస్మితా భట్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు 45 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, ఈ ఏడాది దసరాకు ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. `లాటరీ కింగ్` అనే టైటిల్ ని ఫైనల్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
