నడిగర సంఘంలో ఈ లొల్లేంటి?
తదుపరి ఎన్నికలు లేకుండానే తమ పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 3 May 2025 5:00 AM ISTచట్టాన్ని ధిక్కరించి, పదవీ కాలం ముగిసినా నడిగర సంఘంలో తమ పదవుల్లో కొనసాగుతున్న వారు జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. నాజర్, విశాల్, కార్తీ వంటి ప్రముఖులు ప్రస్తుతం దీనికి సమాధానం ఇవ్వాల్సి ఉందని వారు వాదిస్తున్నారు. మూడేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా సదరు ఈసీ సభ్యులు పదవుల్లో కొనసాగుతున్నారు. తదుపరి ఎన్నికలు లేకుండానే తమ పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించుకున్నారని విమర్శలు వస్తున్నాయి. 2024లోనే పదవీ కాలం ముగిసినా ఇప్పటికీ వారంతా పదవుల్లో కొనసాగడాన్ని ప్రత్యర్థులు కోర్టులో నిలదీస్తున్నారు.
8 సెప్టెంబర్ 2024న జరిగిన అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో నడిగర సంఘం కొత్త భవన నిర్మాణం కొనసాగుతున్నందున జనరల్ బాడీ ఈసీ సభ్యుల పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించాలని సభ్యులు నిర్ణయించారు. ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది. ఇది చట్టపరమైన సవాలుకు తెరతీసింది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ప్రక్రియ.
కానీ దీనిని దాటవేసి పదవుల్ని పొడిగించుకోవడం చట్టవిరుద్ధమైన నిర్ణయంగా పరిగణిస్తారు. పదవీకాల పొడిగింపునకు వ్యతిరేకంగా నంబిరాజన్ అనే సంఘం సభ్యుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తీర్మానాన్ని చట్టవిరుద్ధంగా చెల్లనిదిగా ప్రకటించాలని కోరారు. ఈ కేసులో కోర్టు తీర్పు ఏమిటన్నది వేచి చూడాలి. తిరిగి ఎన్నికలు జరగాలా లేదా? పొడిగింపును కోర్టు అనుమతిస్తుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
2022 ఎన్నికలలో నటుడు నాసర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా, నటులు పూచి మురుగన్, కరుణాస్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2024లోనే పదవీకాలం ముగిసినా ఇప్పటికీ తమ పదవుల్లో కొనసాగుతుండడాన్ని ప్రత్యర్థులు కోర్టులో సవాల్ చేసారు.
