Begin typing your search above and press return to search.

తెలుగు ఇండ‌స్ట్రీని ఆస్కార్ వేదిక‌పై నిల‌బెట్టారు: నాగ్

ఇప్పుడు ఆ ఇద్ద‌రికీ నా సామిరంగా ప్రీరిలీజ్ వేదిక‌పై తొలిసారి స‌ముచిత గౌర‌వం ద‌క్కింది

By:  Tupaki Desk   |   10 Jan 2024 5:40 PM GMT
తెలుగు ఇండ‌స్ట్రీని ఆస్కార్ వేదిక‌పై నిల‌బెట్టారు: నాగ్
X

2023లో ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్ తో పాటు, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ వంటి అంత‌ర్జాతీయ‌ పుర‌స్కారాలను గెలుచుకునే అవ‌కాశం క‌లిగింది ఆర్.ఆర్.ఆర్ తో. ఈ సినిమాలో 'నాటు నాటు..' పాట వ‌ల్ల‌నే మ‌న‌కు ఆస్కార్ ద‌క్కింది. భార‌త‌దేశానికి ఉత్త‌మ ఒరిజిన‌ల్ సంగీతం కేట‌గిరీలో తొలి ఆస్కార్ అందుకుంది. అయితే దీనివెన‌క సంగీత దిగ్గ‌జం ఎం.ఎం.కీరవాణి, ఆ పాట‌ను రాసిన సీనియ‌ర్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ కృషి మ‌రువ‌లేనిది.

ఇప్పుడు ఆ ఇద్ద‌రికీ నా సామిరంగా ప్రీరిలీజ్ వేదిక‌పై తొలిసారి స‌ముచిత గౌర‌వం ద‌క్కింది. ఈ వేదికపైకి సాద‌రంగా ఆహ్వానించ‌డ‌మే గాక‌.. ఆ ఇద్ద‌రు దిగ్గ‌జాల‌ను స‌ముచితంగా గౌర‌వించారు కింగ్ నాగార్జున‌. మునుప‌టి లా కాకుండా ఈసారి నాగ్ స‌ర్ ఇంట్రో ఇచ్చిన తీరు కూడా ఆక‌ట్టుకుంది. నాగార్జున వేదిక‌పైకి ఆ ఇద్ద‌రినీ ఆహ్వానిస్తూ -''వీళ్లిద్ద‌రూ సామాన్యులు కాదు .. తెలుగు ఇండ‌స్ట్రీని ఆస్కార్ వేదిక‌పై నిల‌బెట్టారు. తెలుగు ఇండ‌స్ట్రీ ఘ‌నత‌ను అంత‌ర్జాతీయ వేదిక‌పై నిల‌బెట్టారు. కీర‌వాణి గారు, చంద్ర‌బోస్ గారిని చ‌ప్ప‌ట్లతో ఆహ్వానిద్దాం. వారిని ఈ వేదిక‌పైకి ఆహ్వానించ‌డాన్ని నా గౌర‌వంగా భావిస్తున్నాను. ఆ ఇద్ద‌రూ నా సామి రంగాకు ప‌ని చేసారు. అది నా సామి రంగా అదృష్టం. ఎన్నో సినిమాల‌కు ప‌ని చేసినా ఇలా ఈ వేదిక‌పైకి పిలిచే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం'' అని అన్నారు.

ఇక ఇదే వేదిక‌పై కింగ్ నాగార్జున ప్ర‌యోగాత్మ‌క‌త‌, కొత్త వారికి అవ‌కాశాలిచ్చే గొప్ప నైజం గురించి మ‌రోసారి ఎం.ఎం.కీర‌వాణి త‌న‌దైన శైలిలో వెల్ల‌డించారు. ఇక నా సామి రంగా కోసం తాను రాసిన పాట‌ల్లో ఏది ఫేవ‌రెట్ అనేది చంద్ర‌బోస్ వెల్ల‌డించారు. ఇందులో 'ఎత్తుకెళ్లాల‌నిపిస్తోందే..' పాట‌లో నాకు న‌చ్చిన వాక్యాలున్నాయని కూడా ఆయ‌న అన్నారు.

''ఎత్తుకెళ్లిపోవాల‌నిపిస్తోందే పిల్లా ఎత్తుకెళ్లిపోవాల‌నిపిస్తుందే పిల్లా..

ఎత ఎంత ఎంత ముద్దుగున్నావంటే...ఒక్క ఒక్క మాట‌లోన చెప్పాలంటే....

చంద‌మామ‌కే పిల్ల‌లు పుడితే.. చంద‌మామ‌కే పిల్ల‌లు పుడితే..నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే..'' అంటూ సాగే పాట‌ను చంద్ర‌బోస్ ఆల‌పించారు. ఈ పాట‌లో గ‌మ్మ‌త్త‌యిన ప‌ద‌బంధాల‌ను రాసాన‌ని తెలిపారు.