Begin typing your search above and press return to search.

మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఆ హిట్ కి సీక్వెల్!

బాలీవుడ్ లో మైలు రాయిగా నిలిచిన చిత్రాల్లో ఆనాటి `మిస్ట‌ర్ ఇండియా` ఒక‌టి అని చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   5 April 2024 2:30 PM GMT
మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఆ హిట్ కి సీక్వెల్!
X

బాలీవుడ్ లో మైలు రాయిగా నిలిచిన చిత్రాల్లో ఆనాటి `మిస్ట‌ర్ ఇండియా` ఒక‌టి అని చెప్పాల్సిన ప‌నిలేదు. అనీల్ క‌పూర్-శ్రీదేవి జంట‌గా అమ్రిష్ పూరి కీల‌క పాత్ర‌లో శేఖ‌ర్ క‌పూర్ తెర‌కెక్కించిన ఈ సూప‌ర్ హీరో చిత్రం ఎంతో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. `నేను క‌ల‌ల యువ‌రాణిని. ప్ర‌తీ ఒక్క‌రి హృద‌యంలో నేను ఉంటాను` అంటూ దివంగ‌త న‌టి శ్రీదేవి.. ` మేరా నామ్ మిస్ట‌ర్ ఇండియా` అంటూ అనీల్ క‌పూర్ చేసిన సంద‌డి ఇప్ప‌టి త‌రం కూడా మ‌ర్చిపోదు.

అంత‌గా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోయిన చిత్ర‌మిది. అందుకే ఇప్పుడీ సినిమాకి మూడు ద‌శాబ్దాల త‌ర్వాత సీక్వెల్ చేస్తున్న‌ట్లు బోనీ కపూర్ ప్ర‌క‌టించారు. అయితే ఈసారి సీక్వెల్ ని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తోనే నిర్మించ‌డానికి బోనీ క‌పూర్ రెడీ అవుతున్నారు. ఈసీక్వెల్ నిర్మించ‌డానికి ఓ పెద్ద స్టూడియో భారీ ఆఫ‌ర్ కూడా ఇచ్చిన‌ట్లు తెలిపారు. బ‌డ్జెట్ విష‌యంలో ఎలాంటి ప్ర‌మాణాలు లేకుండా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

స‌ద‌రు స్టూడియోతో- జీస్టూడియోతోనూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు బోనీ క‌పూర్ తెలిపారు. త్వ‌ర‌లోనే `మిస్ట‌ర్ ఇండియా-2` పూర్తి వివ‌రాలు చెబుతా అన్నారు. మ‌రి ఈ చిత్రానికి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? అందాల తార శ్రీదేవి పోషించిన ఆ పాత్ర ఎవ‌రికి ద‌క్కుతుంది? ఆమెతో రొమాన్స్ చేసే హీరో ఎవ‌రు? అన్న వివ‌రాలు మాత్రం ఇంకా రివీల్ చేయ‌లేదు. ఈ సీక్వెల్ ప్ర‌క‌ట‌న‌తో `మిస్ట‌ర్ ఇండియా` అభిమానుల్లో జోష్ మొద‌లైంది. సినిమాని వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని కోరుతున్నారు.

అలాగే బోనీ క‌పూర్ ` నో ఎంట్రీ -2` చిత్రాన్ని కూడా తెర‌పైకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇలా వ‌రుస‌గా బోనీ క‌పూర్ త‌న హిట్ సినిమాల‌కి సీక్వెల్స్ ని తెర‌పైకి తేవ‌డం విశేషం. మ‌రి వీటిలో కుమార్తె జాన్వీక‌పూర్ ఏదైనా పాత్ర‌కు త‌యారు చేస్తారా? అన్న‌ది చూడాలి. అలాగే బోనీ క‌పూర్ రెండ‌వ కుమార్తె ఖుషీ క‌పూర్ కూడా తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.