Begin typing your search above and press return to search.

మిరాయ్ నటుడు కన్నుమూత.. ఏమైందంటే?

నేపాలీ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, తెలుగు ప్రేక్షకులకు తన నటనతో మరెన్నో సినిమాలతో దగ్గరవ్వకముందే కాలం చేయడం సినీ ప్రియులను కలచివేస్తోంది.

By:  Madhu Reddy   |   7 Feb 2026 6:24 PM IST
మిరాయ్ నటుడు కన్నుమూత.. ఏమైందంటే?
X

సినిమా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. 'హనుమాన్' ఫేమ్ తేజ సజ్జా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'మిరాయ్‌'లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సునీల్ థాపా మనల్ని విడిచివెళ్లారు. నేపాలీ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, తెలుగు ప్రేక్షకులకు తన నటనతో మరెన్నో సినిమాలతో దగ్గరవ్వకముందే కాలం చేయడం సినీ ప్రియులను కలచివేస్తోంది. సునీల్ థాపా ఆకస్మిక మరణానికి గల కారణాలు మరియు ఆయన సినీ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

అనారోగ్యం తో ఆసుపత్రిలో కన్నుమూత:

ప్రముఖ నేపాలీ నటుడు సునీల్ థాపా (68) శనివారం మరణించారు. ఆయన మరణానికి అనారోగ్యం కారణం అని,. శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఖాట్మాండ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని 'మిరాయ్‌' చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ధృవీకరిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేసింది.

40 ఏళ్ల ప్రస్థానం - 300 చిత్రాలు:

సునీల్ థాపా సినీ ప్రస్థానం సామాన్యమైనది కాదు. సుమారు 40 ఏళ్ల కెరీర్‌లో ఆయన 300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1981లో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ హిందీ చిత్రం 'ఏక్ దుజే కే లియే'తో ఆయన నటుడిగా రంగప్రవేశం చేశారు. అక్కడి నుండి బాలీవుడ్‌లో పాపులర్ అయ్యి, ఆ తర్వాత నేపాలీ చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్‌గా ఎదిగారు. ప్రియాంక చోప్రా నటించిన 'మేరీకోమ్' చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. తెలుగు, తమిళం, హిందీ, నేపాలీ మరియు భోజ్‌పురి భాషల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన 'మిరాయ్‌' చిత్రంలో సునీల్ థాపా ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మరిన్ని సినిమాలతో తెలుగు అభిమానులకు చేరువయ్యే తరుణం లో ఆయన మరణించడం చిత్ర యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నటనను వెండితెరపై చూసి మురిసిపోయేలోపే ఆయన అనంతలోకాలకు వెళ్లిపోవడం అభిమానులకు తీరని లోటు.