అరటిపళ్ల బండి నుంచి దర్శకుడిగా ఈ స్థాయికి..!
కింది స్థాయి నుంచి ఎదిగేవాళ్లలో ఒక రకమైన కసి ఉంటుంది. అలాంటి కసి ఉన్న ప్రతిభావంతుడు మారుతి. అందుకే అతడు అంచెలంచెలుగా ఈరోజు ఒక పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు.
By: Sivaji Kontham | 28 Dec 2025 2:38 PM ISTకింది స్థాయి నుంచి ఎదిగేవాళ్లలో ఒక రకమైన కసి ఉంటుంది. అలాంటి కసి ఉన్న ప్రతిభావంతుడు మారుతి. అందుకే అతడు అంచెలంచెలుగా ఈరోజు ఒక పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు. అతడు కేవలం 11 సినిమాల దర్శకుడు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్నే డైరెక్ట్ చేసాడు. తన కెరీర్ బిగ్గెస్ట్ సినిమా `ది రాజా సాబ్` 2026 సంక్రాంతి బరిలో విడుదలవుతుంటే మారుతి ఎంతో ఎమోషనల్ గా ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నాడు. హైదరాబాద్ లో తన సినిమా ప్రీరిలీజ్ వేడుకలో అతడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.
ఇక ఇదే వేదికపై మారుతి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన మరొక వ్యక్తి ఉన్నారు. అతడు యువ నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఇటీవల తనదైన భావజాలాన్ని బలమైన టోన్తో ధైర్యంగా వినిపిస్తున్న ఎస్కేఎన్. మారుతి దర్శకుడు కాక ముందు నుంచి తామిద్దరం స్నేహితులం అని అతడు వెల్లడించారు. దశాబ్ధాలుగా తమ మధ్య స్నేహం ఎలా కొనసాగిందో కూడా ఎస్కేఎన్ `ది రాజా సాబ్` వేదికపై చెప్పుకొచ్చారు. తండ్రి అరటిపళ్ల బండి నుంచి మారుతి ఈ స్థాయికి ఎదిగాడని తాను చూసిన విషయాన్ని కూడా చెప్పాడు.
ఆ సమయంలో నిర్మాత ఎస్కేఎన్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. రూ.20ల ఫుల్ మీల్స్ కోసం తలో ఎనిమిది రూపాయలు తెచ్చుకుంటే, మిగిలిన బ్యాలెన్స్ కోసం మరో వ్యక్తి కోసం వెతికిన రోజులను అతడు గుర్తు చేసుకున్నాడు. చాలా కింది స్థాయి నుంచి స్నేహితులిద్దరూ ఒక్కో మెట్టు ఎక్కారని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. రంగుల మాయా ప్రపంచంలో ఇలా ఒకరు దర్శకుడిగా ఎదిగితే, ఇంకొకరు నిర్మాతగా ఎదిగారు. ఇలా ఎదగడం అంత సులువేమీ కాదు. కానీ ఎదిగి చూపించారు. ఎస్కేఎన్ ఇప్పుడు తెలుగు, తమిళం సహా పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నానని ఈ వేదికపై తెలిపారు.
ఒక ఫుట్ పాథ్ పై అరటిపళ్ల బండి నడిపించే ఒక సాధారణ వ్యాపారి కుమారుడు ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్ ని డైరెక్ట్ చేయడం అంటే ఆషామాషీ కాదు. దర్శకుడు మారుతి ఎదుగుదలను ఇండస్ట్రీ కూడా ప్రశంసిస్తోంది. అతడు మొదట యానిమేషన్ రంగంలో నైపుణ్యం సంపాదించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా యానిమేషన్ లో శిక్షణ నిచ్చానని గత ఇంటర్వ్యూలలో మారుతి చెప్పారు. `ఈరోజుల్లో` లాంటి చిన్న సినిమా కోసం స్నేహితులతో కలిసి రూ.10లక్షలు అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టిన రోజులను మారుతి ఎప్పటికీ మర్చిపోలేదు. తాజా ఈవెంట్లో ఈ ఉద్వేగాలన్నీ స్పష్ఠంగా కనిపించాయి.
ది రాజా సాబ్ వేదికపై ఎస్కేఎన్ మాట్లాడుతూ ``నాలుగేళ్ల క్రితం రాజా సాబ్ సినిమాకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాక, ఆ సమయంలో మారుతి చేసిన ఒక మూవీ అనుకున్నంత ఆడలేదు. అప్పుడు ప్రభాస్ గారిని ఇంటికి వెళ్లి మారుతి కలిశారు. అక్కడే కార్లో కొన్ని గంటల పాటు వేచి చూసాను. బయటకు వచ్చాక మారుతి నాతో ఒకటే చెప్పారు. ఇక నా కెరీర్ లో రెండుమూడేళ్ల పాటు నా ఆలోచనల్లో ఒక్క `రాజా సాబ్` మాత్రమే ఉంటుంది అన్నారు. ఏం జరిగింది డార్లింగ్? అని అడిగాను. ఆ సినిమా సక్సెస్ కాకుంటే అందులో నీ తప్పు ఏం ఉంది? మనం సినిమా చేస్తున్నామని ప్రభాస్ గారు చెప్పారని మారుతి నాతో అన్నారు. ప్రభాస్ ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పరు. ఇచ్చిన మాటకు కట్టుబడి సినిమా చేసారు`` అని తెలిపారు.
ప్రభాస్ కల్మషం లేని వ్యక్తి అని, ఆయనకు సినిమా చేయడం తప్ప ఇంకేమీ తెలియదని కూడా ఎస్కేఎన్ అన్నారు. యూరప్ లో షూటింగ్ చేస్తుంటే ఒక విల్లా మొత్తం తీసుకుని, అందులో ఆయన పర్సనల్ చెఫ్ తో తెలుగు వంటలు చేయించి మాకు భోజనం పెట్టారు. ఇంతమంచి వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడకుండా ఎలా ఉంటాం. సంక్రాంతికి కోళ్ల మీద పందేలు వేస్తాం.. ఈసారి డైనోసార్ మీద పందెం వేయబోతున్నామని ఎమోషనల్ గా మాట్లాడారు.
