ఈ మిస్సు దురదృష్ట నాయిక ఎందుకు అంటే?
వినోద పరిశ్రమలో మహిళల పట్ల ఉన్న అవగాహన గురించి మానుషి చిల్లార్ మాట్లాడుతూ, స్త్రీలు నిరంతరం అగౌరవం, ధిక్కారం కారణంగా చర్చల్లోకొస్తారని వ్యాఖ్యానించింది.
By: Tupaki Desk | 6 Jun 2025 9:15 AM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన `ఆపరేషన్ వేలెంటైన్`లో నటించింది మానుషి చిల్లర్. తనదైన అందం, నటనతో ఆకట్టుకున్నా కానీ, ఆ తర్వాత తెలుగులో అవకాశాలు అందుకోలేదు. ఈ భామ బాలీవుడ్ లో పృథ్వీరాజ్ అనే హిస్టారికల్ మూవీలో ఖిలాడీ అక్షయ్ కుమార్ సరసన నటించింది. అక్కడ కూడా సరైన విజయాల్లేవ్. ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకుని, సినీరంగంలో ప్రవేశించిన మానుషికి ఈ రంగంలో సరైన అవకాశాల్లేవ్. ఇప్పటివరకూ అందాల పోటీల నుంచి వచ్చిన చాలా మంది భామలతో పోలిస్తే, మానుషి దురదృష్ట నాయిక అనడంలో ఎలాంటి సందేహాల్లేవ్. మానుషి నటిగా ఎంట్రీ ఇచ్చాకే మూడేళ్ల పాటు కరోనా క్రైసిస్ తీవ్ర ఆటంకాల్ని కలిగించింది. ఆ రకంగా కూడా మానుషి ఎదుగుదలకు చెక్ పడింది.
అయినా పట్టువదలని విక్రమార్కుని సోదరిలా మానుషి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే మానుషి ఇటీవల స్త్రీ వాదాన్ని బయటపెట్టడం ఇండస్ట్రీలో చర్చగా మారింది. వినోద పరిశ్రమలో మహిళల పట్ల ఉన్న అవగాహన గురించి మానుషి చిల్లార్ మాట్లాడుతూ, స్త్రీలు నిరంతరం అగౌరవం, ధిక్కారం కారణంగా చర్చల్లోకొస్తారని వ్యాఖ్యానించింది. సినీ పరిశ్రమలో స్త్రీ ద్వేషపూరిత వైఖరిని మానుషి విమర్శించారు.
స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వం కారణంగా, స్త్రీ విజయాన్ని ఆమెకు ఆపాదించకుండా, పురుషుడి పోషణకు ఆపాదించడం సులభం. వాస్తవ ప్రపంచంలో ఎటువంటి ప్రభావం చూపని తెలివితక్కువ కామెంట్లను నేను ఎప్పుడూ విస్మరించాను.. కానీ నిరంతరం పని చేసే మహిళల విషయంలో, ముఖ్యంగా వినోద పరిశ్రమలో అలాంటి అగౌరవం, ధిక్కారాలను చూస్తున్నాను.. అని వ్యాఖ్యానించారు. నేను సాధికారత కలిగిన, విద్యావంతులైన వాతావరణంలో పెరిగాను, అక్కడ లింగభేధంతో సంబంధం లేదు. అందరికీ సమాన విలువ ఉంటుంది. కానీ నేను కూడా ఇండస్ట్రీలో అవమానాలకు గురయ్యాను.. అని తెలిపింది. మగవాళ్లు కష్టపడి పనిచేస్తారు..విజయం సాధిస్తే ప్రతిభావంతులు.. అయితే మహిళలు అవకాశవాదులు.. గోల్డ్ డిగ్గర్స్.. మానిప్యులేటర్లు! ఇలాంటి చెడు విన్నాను... అని తెలిపింది.
మానుషి 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకుంది. ఇతర అందాల భామల్లానే వెండితెర కలలను నిజం చేసుకునేందుకు బాలీవుడ్ లో అడుగుపెట్టింద. స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన చారిత్రాత్మక డ్రామా సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంతో బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసింది. విక్కీ కౌశల్ సరసన ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ వంటి ప్రాజెక్టులను చేసింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అలయ ఎఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్లోను మానుషి కనిపించింది. ఇవన్నీ ఫ్లాప్ సినిమాలు. తదుపరి జాన్ అబ్రహంతో కలిసి టెహ్రాన్ చిత్రంలో కనిపించనుంది.
