జాతీయ అవార్డులు అంటేనే నటుడికి అసహ్యం!
అవార్డులు అంటేనే కొందరికి అసహ్యం. అర్హత ఉన్న నటుడు లేదా నటికి, అర్హత ఉన్న సినిమాకి అవార్డులు ఇచ్చే రోజులు పోయాయని చాలా మంది నమ్ముతున్నారు.
By: Sivaji Kontham | 16 Sept 2025 10:00 PM ISTఅవార్డులు అంటేనే కొందరికి అసహ్యం. అర్హత ఉన్న నటుడు లేదా నటికి, అర్హత ఉన్న సినిమాకి అవార్డులు ఇచ్చే రోజులు పోయాయని చాలా మంది నమ్ముతున్నారు. కొన్నిసార్లు కొందరికి అనుకోకుండా జాక్ పాట్ తగులుతుంది తప్ప ప్రతిసారీ ప్రతిభకు పురస్కార గౌరవం దక్కదనే నమ్మకం ఎవరికీ లేదు. చాలా మంది స్టార్లు, ఫిలింమేకర్స్ జూరీ ఎంపికల విషయంలో నిజాయితీని ప్రశ్నించారు. సందేహాలు వ్యక్తం చేసారు. జాతీయ అవార్డులు లేదా చాలా పురస్కారాల విషయంలో ఇది రెగ్యులర్ గా వినిపించే విమర్శ.
మనోజ్ భాజ్ పేయి అంతటి నటుడు ఇప్పుడు మరోసారి అవార్డులపై తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. బహిరంగంగా తన నిరాశను బయటపెట్టాడు. అవార్డుల గురించి మాట్లాడటం పనికి రాని సంభాషణ అని, ఓడిపోయే సంభాషణ అని అతడు తీవ్ర నిరాశను వ్యక్తం చేసాడు. జాతీయ అవార్డు అయినా ఇతర అవార్డు అయినా ఇదే ప్రహసనం అని అతడు సూటిగానే మాట్లాడారు. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటుడిగా గౌరవం అందుకున్న మనోజ్ భాజ్ పాయ్ మరో రెండుసార్లు జాతీయ అవార్డులను కోల్పోయానని బలంగా నమ్ముతున్నారు. దానిపై ప్రతిసారీ అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
దీనికి కారణం అతడు పదే పదే తనకు అవార్డు దక్కుతుందని ఆశించిన ప్రతిసారీ జూరీ ఎంపికల కారణంగా నిరాశపడటమే. 2016లో అలీఘర్ చిత్రంలో అతడి నటనకు కచ్ఛితంగా అవార్డు వస్తుందని ఆశించాడు. కానీ అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ నటించిన రుస్తోమ్ కి అవార్డు వెళ్లిపోయింది. అది అతడిని తీవ్రంగా నిరాశపరిచింది. `జవాన్`లో పెర్ఫామెన్స్ కోసం షారుఖ్ ఖాన్ జాతీయ అవార్డును అందుకున్నారు. ట్వల్త్ ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సే తో కలిసి ఖాన్ అవార్డును షేర్ చేసుకున్నారు. కానీ అదే ఏడాదిలో వచ్చిన తన సినిమా `జోరామ్`కి పురస్కారం దక్కుతుందని మనోజ్ చాలా ఎదురు చూసాడు. జోరామ్ లో అతడి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కానీ, అది జాతీయ అవార్డుల జూరీకి కనిపించలేదు.
అయితే పనికిరాని సంబాషణ, ఓడిపోయిన సంభాషణ అంటూ మనోజ్ పదే పదే జాతీయ అవార్డులపై అసహనం వ్యక్తం చేయడంతో అది షారూఖ్ ని ఉద్ధేశించి అతడు అన్న మాటలు అంటూ కొన్ని మీడియాలు ప్రచారం చేయడం ప్రారంభించాయి. నిజానికి మనోజ్ ఉద్ధేశం కేవలం జూరీని విమర్శించడం. అతడు షారూఖ్ ని విమర్శించేందుకు అవకాశం లేదు. మనోజ్ బాజ్పేయి ఎప్పుడూ షారుఖ్ ఖాన్ గురించి ప్రేమగా మాట్లాడుతుంటాడు. ఇది మరొక సందర్భం. అతడు మళ్ళీ అవార్డు గెలుచుకోకపోవడం గురించి మాత్రమే మాట్లాడాడు. అయిపోయిన అవార్డుల గురించి మళ్లీ మాట్లాడటం దండగ అనేది కూడా అతడి ఉద్దేశం. నా ఫిల్మోగ్రఫీలో చాలా ప్రత్యేకమైన చిత్రం .. జోరామ్.. అని మాత్రమే అతడు అన్నాడు.
``నా సినిమాల చరిత్రలో అవి అగ్రస్థానంలో ఉంటాయి. కానీ నేను ఈ విషయాలను చర్చించను.. ఎందుకంటే ఇది చాలా ఓడిపోయే సంభాషణ. ఇది గతంలో జరిగినదే .. దీనిని అలా వదిలివేయాలి.. `` అని మనోజ్ నిరాశను వ్యక్తం చేసాడు. కేవలం జాతీయ అవార్డుల గురించి మాత్రమే కాదు... అన్ని అవార్డుల గురించి నిరాశను వ్యక్తం చేసాడు. జూరీ కచ్చితంగా ఆలోచించాలి. అవార్డు రానప్పుడు ఆ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ కూడా దీనిని పట్టించుకోవాలని కూడా అతడు అన్నాడు. ఇది నా గౌరవం గురించి కాదు ..ను సినిమాను ఎంచుకునేటప్పుడు నా గౌరవాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.. నేను నటుడిగా చాలా బాధ్యత వహిస్తాను. కానీ ప్రతి సంస్థ తమ గురించి ఆలోచించాలి.. అది నా పని కాదు. తమ నటులు గౌరవాన్ని కోల్పోతుంటే సంస్థ ప్రతినిధులు దాని గురించి ఆలోచించాలి.. అని కూడా మనోజ్ భాజ్ పాయ్ అన్నారు. ఇక షారూఖ్ గురించి మనోజ్ భాజ్ పాయ్ చాలా ప్రేమగా మాట్లాడుతారు. అతడు పరిశ్రమను ఆలింగనం చేసుకునే తీరు విస్మయపరుస్తుందని కూడా గతంలో అన్నాడు.
