కన్నప్ప : ప్రభాస్ 'రాజాసాబ్' కంటే ఎక్కువ
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా విడుదల తేదీ సమీపిస్తోంది. జూన్ 27న విడుదల కాబోతున్న కన్నప్ప సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
By: Tupaki Desk | 6 Jun 2025 5:30 PMమంచు విష్ణు 'కన్నప్ప' సినిమా విడుదల తేదీ సమీపిస్తోంది. జూన్ 27న విడుదల కాబోతున్న కన్నప్ప సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గత దశాబ్ద కాలంగా మంచు విష్ణు నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు లైట్ తీసుకుంటూ ఉండేవారు. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు. కచ్చితంగా కన్నప్ప సినిమా స్పెషల్ అన్నట్లుగా నిలువబోతుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. మంచు విష్ణు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆ నమ్మకం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే విష్ణు నుంచి ఒక మంచి ప్రయత్నం అని విమర్శకులు సైతం ప్రశంసించే విధంగా సినిమా ఉంటుంది అని చాలా మంది అంటున్నారు.
గత చిత్రాలతో విష్ణు ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఆయన ప్రతి సినిమా కోటాను కోట్ల నష్టాలను మిగిల్చిన విషయం తెల్సిందే. అయినా కూడా మంచు విష్ణు ఈ సినిమాను అత్యధిక బడ్జెట్తో నిర్మించాడు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ను విష్ణు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అనధికారిక లెక్కలు, లో గుట్టు ప్రకారం దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ను మంచు విష్ణు ఈ సినిమా కోసం ఖర్చు చేసి ఉంటాడు. తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బడ్జెట్ గురించి స్పందించాడు. ఈ సినిమాకు ఎంత ఖర్చు చేశారు అంటూ సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించిన సమయంలో ఆయన నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది.
సినిమాకు ఎంత బడ్జెట్ ఖర్చు చేశాము అనేది చెప్తే కచ్చితంగా రేపు పొద్దున్న ఐటీ వాళ్లు మా ఇంటి ముందు క్యూ కడతారు. కన్నప్ప సినిమా కోసం భారీ గా ఖర్చు చేసిన మాట వాస్తవం అన్నాడు. ఈ ఏడాది వచ్చిన, రాబోతున్న సినిమాల్లో మా సినిమా బడ్జెట్ అత్యధికం అన్నాడు. అదే సమయంలో రాజాసాబ్ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువానా.. అంటూ ప్రశ్నించగా మంచు విష్ణు తడుముకోకుండా కచ్చితంగా ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా కంటే మా కన్నప్ప బడ్జెట్ ఎక్కువ అన్నాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కంటే కూడా మా సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అని మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కన్నప్ప సినిమాను మూడు ఏళ్లకు పైగా చేశాడు. ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీ నటులు నటించారు. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా యొక్క గ్రాఫిక్స్ వర్క్ కోసం మెజార్టీ భాగంను ఖర్చు చేశారు. మొదట చేసిన వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో అసంతృప్తి ఉండటంతో మరోసారి మొత్తం చేయించారని తెలుస్తోంది. దాంతో బడ్జెట్ విపరీతంగా పెరిగింది. అందుకే రాజాసాబ్, ఓజీ కంటే కూడా ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అని మంచు విష్ణు బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఆయన నెంబర్ చెప్పలేదు కానీ.. ఆయన మాటల ప్రకారం ఈ సినిమాకు రూ.300 కోట్ల కంటే ఎక్కువగానే ఖర్చు చేసి ఉంటారు. విడుదల తర్వాత ఆ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.