ఫైనాన్షియర్కి మంత్రించిన మాంసం ముద్ద తినిపించిన నిర్మాత
అయితే ఇదే సినీపరిశ్రమలో సినీమేధావులు కొందరు తంత్ర విద్యల్ని కూడా నమ్ముతారనేది అరుదుగా తెలిసే విషయం. ఇప్పుడు ఒక అగ్ర నిర్మాత వెల్లడించిన ఒక విషయం పెద్ద షాకిచ్చింది.
By: Sivaji Kontham | 5 Oct 2025 6:00 AM ISTసినీపరిశ్రమలో నమ్మకాలు సెంటిమెంట్లు చిత్ర విచిత్రమైనవి. కోట్లాది రూపాయల జూదంలో ఇలాంటివన్నీ పుట్టుకొస్తుంటాయి. అయినా ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. బొటన వేలి చివర్లో ఒక ప్రత్యేక ఉంగరం అదృష్టాన్ని పెంచి పోషించవచ్చు. ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ డమ్ ని కూడా ఇవ్వొచ్చు.
అంతగా నమ్మకం లేకపోయినా..!
అయితే ఇదే సినీపరిశ్రమలో సినీమేధావులు కొందరు తంత్ర విద్యల్ని కూడా నమ్ముతారనేది అరుదుగా తెలిసే విషయం. ఇప్పుడు ఒక అగ్ర నిర్మాత వెల్లడించిన ఒక విషయం పెద్ద షాకిచ్చింది. అతడికి తాంత్రిక విద్యలపై అంతగా నమ్మకం లేకపోయినా కానీ, స్నేహితుడు చెప్పినది విన్నాడు. ముందుగా తాను సినిమా తీయాలంటే ఫైనాన్షియర్ సపోర్ట్ అవసరం. కానీ ఫైనాన్షియర్ ని వెతికి పట్టుకోవడం చాలా కష్టంగా మారింది.
ఆశ నిరాశ మధ్య:
ఇక సినిమా చేయలేను అనుకున్న సమయంలో వారణాసిలో ఒక మాంత్రికుడిని కలిసారు. అతడు మంత్రించిన మాంసం ముద్దను తీసి దానినుంచి ఒక ముక్కను నిర్మాతకు ఇచ్చాడు. దానిని అతడు కలవాలనుకుంటున్న ఫైనాన్షియర్ కి ఏదో ఒక రూపంలో తినిపించమని చెప్పాడు. తన స్నేహితుడితో కలిసి నిర్మాత ఆ ప్రయత్నం చేసాడు.
కిళ్లీలో మాంసం ముక్క:
వారు ఒక కిళ్లీలో మాంసం ముక్కను కలిపారు. దానిని తినాల్సిందిగా ఫైనాన్షియర్ వెంటపడ్డారు. జమీందార్ లాంటి అతడు దానిని సున్నితంగా తిరస్కరించాడు. అయినా అతడిని వదలకుండా చివరకు ఒప్పించారు. అతడు ఆ కిళ్లీని నమలడం ప్రారంభించాక స్కైలో తేలిన ఫీలింగ్ కలిగిందట సదరు నిర్మాతకు. ఇక తన సినిమాకి అవసరమైన పెట్టుబడి దొరికినట్టేనని భావించాడు. కానీ ఆ మాంత్రికుడు చెప్పినట్టు ఏదీ జరగలేదు. ఫైనాన్షియర్ ఆ సినిమాకు పెట్టుబడి సాయం చేయలేదు.
20 ఏళ్ల వయసులో ఇది నమ్మాడు:
ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలో అగ్ర నిర్మాత ఎవరో కాదు.. బాలీవుడ్ దిగ్గజ ఫిలింమేకర్ మహేష్ భట్. అతడు ఆలియా భట్, పూజా భట్లకు తండ్రి అన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన పాపులర్ నిర్మాత. తన కుమార్తె పూజా భట్ తో పాడ్ కాస్ట్ లో ఈ విషయాన్ని మహేష్ భట్ చెప్పుకొచ్చారు. స్నేహితుడిని నమ్మి వారణాసిలో తాంత్రికుడిని కలిసినా కానీ తనకు ఆశించినది దక్కలేదు. 20 ఏళ్ల వయసులో అతడు అలాంటి గుడ్డి నమ్మకాన్ని ఆశ్రయించాడు.
అది నిజంగా షాకింగే:
వారణాసిలో తాంత్రికుడిని కలిసినప్పుడు అతడు తన అల్మారా తెరిచి, గుండ్రంగా చుట్టిన బంతిలా కనిపించేదాన్ని బయటకు తీశాడు. దాని నుంచి ఒక ముక్కను తీసి ఒక పుడియాను తయారు చేశాడు. ఇది ఘాట్ల నుండి తీసిన మానవ మాంసం అని చెప్పాడు. ఈ ముక్కను తీసుకొని ఫైనాన్షియర్ కు తినిపించండి అని చెప్పాడు. ఏం చేసినా కానీ ఫలితం శూన్యం.
