Begin typing your search above and press return to search.

మహేష్ బాబు మూవీ సాంగ్ "కుర్చీ మడతపెట్టి" తాత మృతి!

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశీ, విదేశీ డాన్స్ గ్రూపులు కూడా ఈ పాటకు రీల్స్ చేస్తూ స్టెప్పులు వేశారు. అలా ఈ పాటతో భారీగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

By:  Madhu Reddy   |   21 May 2026 10:34 AM IST
మహేష్ బాబు మూవీ సాంగ్ కుర్చీ మడతపెట్టి తాత మృతి!
X

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టి వేస్తున్నాయి. అభిమాన సెలబ్రిటీలు కొంతమంది తుది శ్వాస విడవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది వయసు మీద పడి వృద్ధాప్య కారణాలవల్ల స్వర్గస్తులయితే.. మరికొంతమంది వివిధ అనారోగ్య కారణాలవల్ల మరణిస్తున్నారు. మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుని తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న తాత మరణించారని తెలిసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అసలు ఆయనకు ఏమైంది? వయస్సు మీద పడడం వల్ల వృద్ధాప్య కారణాల వల్ల మరణించారా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కుర్చీ మడత పెట్టి తాత మరణం వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ జనాలకు ఏ విధంగా పాపులారిటీ అందిస్తుందో ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ తాత నిదర్శనం అనే చెప్పాలి. ఒకే ఒక్క ఇంటర్వ్యూ.. యాదృచ్ఛికంగా నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క డైలాగ్ తో రాత్రికి రాత్రే ఒక సామాన్యుడు కాస్త ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీగా పేరు దక్కించుకున్నారు. తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా తన భార్యతో జరిగిన ఒక గొడవ తాలూకా సంభాషణను ఆయన వివరిస్తూ.. చాలా సహజంగా మాస్ శైలిలో "ఆ కుర్చీని మడతపెట్టి".. అంటూ ఒక బూతు పదం తో కూడిన డైలాగును ఆయన ఉపయోగించారు.

ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయనకు ఊహించని పాపులారిటీ లభించింది. ముఖ్యంగా ఈ డైలాగు ఎంత ట్రెండ్ అయింది అంటే మీమ్స్ ప్రపంచాన్ని అది కొన్ని నెలలపాటు శాసించింది అని చెప్పవచ్చు. ఇది గమనించిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో ఒక మాస్ సాంగ్ కోసం ఈ లైన్ ఉపయోగించుకున్నారు. ఇక ఈ పాట కూడా సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశీ, విదేశీ డాన్స్ గ్రూపులు కూడా ఈ పాటకు రీల్స్ చేస్తూ స్టెప్పులు వేశారు. అలా ఈ పాటతో భారీగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ పాట వీడియోలో స్వయంగా కుర్చీ తాత కూడా మహేష్ బాబు, శ్రీలీలతో కలసి కొద్దిసేపు స్క్రీన్ పంచుకోవడం , డాన్స్ స్టెప్పు వేయడం కూడా విశేషం. అలా ఈ ఒక్క పాటతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన ఇప్పుడు తుది శ్వాస విడిచారు.

ఈయన అసలు పేరు మహమ్మద్ కాలా బాషా (66).. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల వల్ల కొన్ని వ్యసనాలకు అలవాటు పడిన ఈయన.. విపరీతంగా మద్యం సేవించేవారు. దానివల్ల కాలేయం చెడిపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఇక రోజూ అలవాటులో భాగంగా ఆయన హైదరాబాదులోని యూసఫ్ గూడా , కృష్ణ కాంత్ పార్క్ పరిసర ప్రాంతాలలో తిరుగుతుండే వారు. ఎప్పటిలాగే బుధవారం మధ్యాహ్నం నగరంలో ఎండ తీవ్రతకు ఆయన శరీరం తట్టుకోలేకపోయింది .

కృష్ణకాంత్ పార్కు లో నడుచుకుంటూ వెళ్తుండగా ఎండ దాటికి తట్టుకోలేక ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఇక ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని ప్రాథమిక చికిత్స నిమిత్తం ఇంటికి తరలించే లోపే మార్గం మధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణించారని తెలియడంతో పలువురు సోషల్ మీడియా నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా యూనిట్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబ్లో అభిమానులు ఆయన మరణానికి సోషల్ మీడియా ద్వారా సంతాపం చెబుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.