తండ్రిని వ్యతిరేకించి కుంభమేళా మోనాలిసా మతాంతర పెళ్లి
ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తన చిరునవ్వుతో నీలి కళ్ళతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన `కుంభమేళా మోనాలిసా` అలియాస్ మోనాలిసా భోంస్లే మళ్లీ వార్తల్లో నిలిచారు.
By: Sivaji Kontham | 11 March 2026 11:24 PM ISTప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తన చిరునవ్వుతో నీలి కళ్ళతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన `కుంభమేళా మోనాలిసా` అలియాస్ మోనాలిసా భోంస్లే మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఈ బ్యూటీ తన గ్లామర్తో కాకుండా తన జీవితంలో తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా.. మతాంతర వివాహం చేసుకుని మోనాలిసా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి పరిచయం సోషల్ మీడియా వేదికగా (ఫేస్బుక్) మొదలై, అది కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. సుమారు ఆరు నెలల పాటు వీరి ప్రేమాయణం సాగింది. ఫర్మాన్ ఖాన్ కూడా ఒక నటుడే కావడంతో వీరిద్దరి మధ్య అభిరుచులు త్వరగా కలిశాయి. అయితే వీరి మతాలు వేరు కావడంతో మోనాలిసా కుటుంబంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ భోంస్లే ఈ వివాహానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అంతేకాకుండా.. ఆమెకు ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తన తండ్రి ఒత్తిడి భరించలేక తన ప్రేమను గెలిపించుకోవాలని భావించిన మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్తో కలిసి కేరళకు చేరుకున్నారు. కేరళలోని తమ వివాహానికి రక్షణగా ఉంటుందని వారు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేరళ చేరుకున్న ఈ జంట.. తమకు ప్రాణహాని ఉందని భావించి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తన తండ్రి తనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు రక్షణ కల్పించాలని మోనాలిసా పోలీసులను కోరారు. తాను మేజర్ని అని తన నిర్ణయాలు తాను తీసుకోగలనని మోనాలిసా స్పష్టం చేయడంతో పోలీసులు తనకు అండగా నిలిచారు. చట్టబద్ధంగా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ వారికి రక్షణ కల్పించారు.
పోలీసుల సమక్షంలోనే తన తండ్రిని ఎదిరించి ఫర్మాన్ ఖాన్తో కలిసి వెళ్లేందుకు ఆమె మొగ్గు చూపారు. అనంతరం కేరళలోని విళింజం వద్ద ఉన్న ఒక ఆలయంలో వీరి వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు కేరళకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి తదితరులు ఈ పెళ్లిలో పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు.
కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ సామాన్యురాలిగా కనిపించిన మోనాలిసా ఇప్పుడు తన ఆత్మగౌరవం కోసం, ప్రేమ కోసం తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాది ఆరు నెలల ప్రేమ కథే అయినా.. అది అరవై ఏళ్ల బంధంలా అనిపిస్తోంది! అని ఫర్మాన్ ఖాన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డబ్బు, కీర్తి కంటే తన మనసు మెచ్చిన వాడితో ఉండటమే మిన్న అని భావించిన మోనాలిసా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కానీ.. ఆమె మాత్రం తన కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు.
