కుబేర : పారితోషికంలో ఆ ఐదుగురు కోట్ల కుబేరులే!
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన 'కుబేర' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
By: Tupaki Desk | 21 Jun 2025 9:30 AMధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన 'కుబేర' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. పెద్దగా పోటీ లేని ఈ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సందడి చేస్తుందని, డీసెంట్ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాను శేఖర్ కమ్ములతో కలిసి సునీల్ నారంగ్ నిర్మించారు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపుగా రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. అందులో మెజార్టీ నటీ నటులు, సాంకేతిక నిపుణులు పారితోషికం ఉందని తెలుస్తోంది.
ఈ సినిమాలో బిచ్చగాడిగా అద్భుతంగా నటించి మెప్పించిన తమిళ హీరో ధనుష్కి అత్యధిక పారితోషికం దక్కింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ ఈ సినిమాకు గాను ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం ను అందుకున్నాడు. అంతే కాకుండా తమిళనాట థియేట్రికల్ రిలీజ్ లాభాల్లో కొంత మేరకు వాటా కూడా ఆయనకు అందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఆయన తీసుకున్న పారితోషికాల్లో ఇదే అత్యధికం అంటున్నారు. ఇక నాగార్జున సైతం ఈ సినిమాకు గాను భారీగానే పారితోషికం తీసుకున్నాడు. మొదట కుబేర సినిమాలో నాగార్జున పాత్ర గెస్ట్ రోల్లా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సినిమాలో ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించాడు.
కుబేర సినిమాలో నటించినందుకు గాను నాగార్జున రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది. తాను హీరోగా నటిస్తే తీసుకున్న పారితోషికంకు దాదాపు సమానంగా నాగ్ ఈ సినిమాకు పారితోషికం అందుకున్నారు. ఈ సినిమాలోని ఆయన పాత్ర ఆకట్టుకుంది. ఇక పుష్ప 2తో పాటు వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న రష్మిక ఈ సినిమాకు గాను రూ.4.5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ముందు సికిందర్ సినిమా నిరాశ పరిచింది. కానీ కుబేర సినిమా ఆమె సక్సెస్ జర్నీని కంటిన్యూ చేసే విధంగా విజయాన్ని సొంతం చేసుకుంది. దానికి తోడు అత్యధిక పారితోషికం అందుకుంది. సినిమాలో రష్మిక పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. అందుకే ఈ స్థాయి పారితోషికం ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.
ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు గాను పారితోషికంగా రూ.5 కోట్లు తీసుకున్నాడట. సొంత నిర్మాణ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కారణంగా లాభాల్లో వాటాగా శేఖర్ కమ్ములకు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు మంచి బీజీఎం అందించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ దాదాపుగా రూ.3 కోట్ల పారితోషికంను అందుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ అయిదుగురు కుబేర సినిమాకు ఐదు పిల్లర్స్ మాదిరిగా నిల్చున్నారు. అందుకే వీరు పారితోషికంలో కుబేరులుగా భారీ మొత్తాన్ని పొందారు. ఇక ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులు వారి అనుభవం, క్రేజ్కు తగ్గట్లుగా పారితోషికం అందుకున్నారు.