ఏదైనా సరే బాలయ్య చెప్పాల్సిందే!
ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుంది? ఎవరు చేయాలనుకున్న సినిమా ఎవరి చేతిలోకి వెళ్తుంది? ఎవరు మొదలుపెట్టిన సినిమాను ఎవరు పూర్తి చేస్తారో చెప్పలేం.
By: Sravani Lakshmi Srungarapu | 1 Sept 2025 1:34 PM ISTఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుంది? ఎవరు చేయాలనుకున్న సినిమా ఎవరి చేతిలోకి వెళ్తుంది? ఎవరు మొదలుపెట్టిన సినిమాను ఎవరు పూర్తి చేస్తారో చెప్పలేం. రీసెంట్ గా క్రిష్ ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా హరి హరి వీరమల్లు ప్రాజెక్టును మొదలుపెట్టి ఆల్మోస్ట్ పూర్తయ్యే టైమ్ లో ఆ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
సెప్టెంబర్ 5న ఘాటీతో ప్రేక్షకుల ముందుకు..
వీరమల్లు నుంచి బయటికొచ్చిన క్రిష్, అనుష్క తో ఘాటీ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. సెప్టెంబర్ 5న ఘాటీ రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో క్రిష్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ కు పలు ప్రశ్నలు ఎదురవగా, బాలయ్య చేయాల్సిన ఆదిత్య999 గురించి కూడా ప్రశ్న ఎదురైంది.
ఆదిత్య999 కు డైరెక్టర్ గా క్రిష్?
ఆదిత్య 369కు సీక్వెల్ గా ఎప్పట్నుంచో ఈ సినిమాను చేయాలని బాలయ్య ఆశపడుతున్నారు. ఈ సినిమా కోసం పలువురి డైరెక్టర్లను అనుకున్నారు. మధ్యలో స్వయంగా బాలయ్యే దీన్ని డైరెక్ట్ చేయాలనుకున్నారు. కానీ రీసెంట్ గా ఆ ప్రాజెక్టు క్రిష్ చేతిలోకి వెళ్లిందని, ఆ సినిమాలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా నటిస్తారని ప్రచారం జరగ్గా, ఘాటీ ప్రమోషన్స్ లో ఇదే ప్రశ్నను క్రిష్ ను అడిగారు.
సీక్రెట్ గా ఉంచుతున్న క్రిష్
ఆదిత్య999 గురించి ఏ ప్రశ్న ఎదురైనా క్రిష్ దానికి ఒకటే సమాధానంతో బదులిచ్చారు. ఆ సినిమాను అనౌన్స్ చేయాల్సింది బాలయ్యేనని, ఆ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడా లేదా అనేది కూడా ఆయనే చెప్పాలని, సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నైనా బాలయ్య చెప్తేనే తెలుస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని క్రిష్ ఫ్రెండ్, నిర్మాత అయిన రాజీవ్ రెడ్డిని అడిగితే డిస్కషన్స్ జరుగుతున్నాయన్నారు. కానీ క్రిష్ మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో చాలా రహస్యాల్ని మెయిన్టెయిన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారమైతే ఈ ప్రాజెక్టు ఆల్రెడీ లాక్ అయిందని ఎప్పుడు లాంచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
