Begin typing your search above and press return to search.

ఆర్జే బాలాజీ.. అంత ఎమోషనల్ అయ్యారేంటి?

అభిమానులు బాలాజీ అంటూ అరవడంతో ఆయన మరింత ఎమోషనల్ అయ్యారు. వెంటనే త్రిష ఆయనను హగ్ చేసుకుని ఓదార్చిన మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  M Prashanth   |   16 May 2026 12:16 AM IST
ఆర్జే బాలాజీ.. అంత ఎమోషనల్ అయ్యారేంటి?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటించిన కరుప్పు సినిమా రిలీజ్ జర్నీ ఒక ఎమోషనల్ డ్రామాకు ఏమాత్రం తీసిపోలేదు. ఆర్థిక ఇబ్బందులు, చివరి నిమిషంలో విడుదల ఆగిపోవడం, కేడీఎం ఫైల్స్ సమస్యలు.. ఇలా ఎన్నో అడ్డంకులు ఎదురైనా చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో కరుప్పు, తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైన ఆ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. ముఖ్యంగా దర్శకుడు ఆర్జే బాలాజీ థియేటర్‌ లో ఎమోషనల్ అయిన వీడియో చక్కర్లు కొడుతోంది.

చెన్నైలోని ప్రముఖ రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్‌ లో సూర్య ఫ్యాన్స్ హంగామా ఫుల్ గా కనిపించింది. ఆ షోకు దర్శకుడు ఆర్జే బాలాజీతో పాటు హీరోయిన్ త్రిష, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, హీరో కార్తీ కూడా హాజరయ్యారు. సినిమా ముగిసిన వెంటనే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి బాలాజీ భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమాలో నాని విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే రైల్వే స్టేషన్ సీన్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు అదే తరహాలో ఆర్జే బాలాజీ ఆనందంతో గట్టిగా అరుస్తూ కనిపించారు. గాల్లోకి పిడికిలి బిగించి, కళ్లలో నీళ్లు తెచ్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానులు బాలాజీ అంటూ అరవడంతో ఆయన మరింత ఎమోషనల్ అయ్యారు. వెంటనే త్రిష ఆయనను హగ్ చేసుకుని ఓదార్చిన మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కష్టం మొత్తం మరిచిపోయే క్షణం ఇదే, సినిమా కోసం పడిన శ్రమకు ఇదే నిజమైన రివార్డంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి కరుప్పు సినిమా మే 14నే విడుదల కావాల్సి ఉంది. తమిళనాడు సీఎం విజయ్ ఉదయం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చినప్పటికీ, నిర్మాత ప్రభుకు ఎదురైన ఆర్థిక సమస్యల కారణంగా కేడీఎం ఫైల్స్ థియేటర్లకు చేరలేదు. దీంతో మొదటి రోజు షోలు రద్దయ్యాయి. ఒకవైపు తమిళనాడులో షోలు ఆగిపోతే, మరోవైపు క్యూబ్ సంస్థ సాంకేతిక పొరపాటుతో ముంబై, పుణె ప్రాంతాల్లో సినిమా వేసింది. దీంతో పైరసీ భయాలు కూడా నిర్మాతలను వెంటాడాయి. అయితే అన్ని ఇబ్బందులను దాటుకుని మే 15న సినిమా విడుదల కావడంతో అభిమానులు భారీగా థియేటర్లకు తరలివచ్చారు.

ఇక చిత్రంలో సూర్య సరసన త్రిష హీరోయిన్‌ గా నటించగా, కార్తీ అతిథి పాత్రలో కనిపించారు. యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం కీలక పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యిందని అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు మిక్స్ డ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. అయితే యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్జే బాలాజీ విషయానికి వస్తే.. నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగా విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు కరుప్పుతో పెద్ద విజయాన్ని అందుకోవాలని ప్రయత్నించారు. విడుదలకు ముందు ఎదురైన ఇబ్బందులు ఆయనను మానసికంగా ఎంత ఒత్తిడికి గురిచేశాయో, థియేటర్‌ లో వచ్చిన ఆ రియాక్షన్ చూస్తే అర్థమవుతోందని అభిమానులు అంటున్నారు.