ఆ క్రేజీ హీరోకి మల్టీస్టారర్ చేసే ఉద్దేశం లేదా?
కొందరు పూర్తి స్థాయి మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు కూడా ఓకే అంటారు. అయితే బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ మాత్రం మల్టీస్టారర్ సినిమాకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 May 2025 11:30 AMసౌత్ సినిమా ఇండస్ట్రీతో పోల్చితే బాలీవుడ్లో ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్టార్ హీరోలు ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ రోల్స్ల్లో నటించడం మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. యంగ్ హీరోలు సైతం ఈగోలకు వెళ్లకుండా సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్లో కనిపించడం మనం చూస్తూ ఉంటాం. షారుఖ్, సల్మాన్, అక్షయ్, రణ్వీర్ సింగ్ ఇలా చాలా మంది హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించడం మనం చూశాం. కొందరు పూర్తి స్థాయి మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు కూడా ఓకే అంటారు. అయితే బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ మాత్రం మల్టీస్టారర్ సినిమాకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
2004లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'ముజ్సే షాదీ కరోగి' కి సీక్వెల్ను రూపొందించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయని, సీక్వెల్లో కూడా ఇద్దరు హీరోలు నటించబోతున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముజ్సే షాదీ కరోగి సినిమాలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లు హీరోలుగా నటించిన విషయం తెల్సిందే. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలకు సీక్వెల్స్ వస్తున్న ఈ సమయంలో ముజ్సే షాదీ కరోగి సినిమాకు సైతం సీక్వెల్ చేస్తే బాగుంటుంది మేకర్స్ భావించారు. అందుకోసం యంగ్ హీరోలు కార్తీక్ ఆర్యన్, వరుణ్ దావన్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. సీక్వెల్కు వీరిద్దరు ఓకే చెప్పారని కూడా ప్రచారం జరిగింది.
తాజాగా ముజ్సే షాదీ కరోగి సీక్వెల్ విషయమై కార్తీక్ ఆర్యన్ స్పందించాడు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ఇప్పట్లో కొత్త సినిమాను చేసే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. అయితే బాలీవుడ్ వర్గాల్లో మాత్రం కార్తీక్ ఆర్యన్ మాత్రం మల్టీ స్టారర్ సినిమాను చేసేందుకు ఆసక్తిగా లేడని తెలుస్తోంది. ముఖ్యంగా వరుణ్ దావన్ వంటి ఫేమ్ లేని హీరో, వరుస ఫ్లాప్స్ల్లో ఉన్న హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది కార్తీక్ ఆర్యన్కి ఇష్టం లేకపోవడం వల్లే తాను బిజీగా ఉన్నాను అంటూ సీక్వెల్ను సున్నితంగా తిరస్కరించి ఉంటాడు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మధ్య కాలంలో వరుణ్ దావన్ నటించిన ఏ ఒక్క సినిమా హిట్ కాలేదు. అందుకే ఆయనతో సినిమాలంటే మేకర్స్ ఆసక్తి చూపడం లేదు.
కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఇతర హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. వారితో పోల్చితే ఇంకాస్త ముందే కార్తీక్ ఆర్యన్ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన సినిమాలు ఎక్కువగా రూ.150 కోట్లు మించి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. భూల్ భులయ్యా 3 సినిమా ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. దాంతో కార్తీక్ ఆర్యన్కి ఫుల్ డిమాండ్ ఉంది. పైగా పారితోషికం కూడా స్టార్ హీరోల స్థాయిలో అందుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో మల్టీ స్టారర్ పేరుతో వేరే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుని ఫ్లాప్ను చవి చూడటం అవసరం లేదని భావిస్తున్నట్లు ఉంటాడు అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.