కమల్ లోని రొమాంటిక్ బాయ్ బయటకు
విశ్వకథానాయకుడిగా మాత్రమే కాదు.. సామాజిక రాజకీయవేత్తగా.. బీజేపీకి అత్యంత వ్యతిరేకిగా వ్యాఖ్యలు చేస్తూ ఉండే ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్.
By: Tupaki Desk | 19 April 2025 5:47 AMవిశ్వకథానాయకుడిగా మాత్రమే కాదు.. సామాజిక రాజకీయవేత్తగా.. బీజేపీకి అత్యంత వ్యతిరేకిగా వ్యాఖ్యలు చేస్తూ ఉండే ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్. వయసు మీద పడిన తర్వాత పెద్దరికం ఇట్టే వచ్చేస్తుంది. అందునా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినీ జీవితాన్ని కంటిన్యూ చేసే వేళ.. చెప్పే మాటల్లోనూ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి లెక్కలకు భిన్నంగా వ్యవహరించారు కమల్ హాసన్.
తాజాగా ఆయన నటించిన థగ్ లైఫ్ మూవీ జూన్ (5) మొదటి వారంలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన తొలి సింగిల్ లిరిక్ ను చెన్నైలో ఆవిష్కరించారు. ఎఆర్ రహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ‘జింగుచ్చా’ పాట.. ఇప్పటి ట్రెండ్ కు దగ్గరగా ఉండటమే కాదు.. విన్నంతనే కనెక్టు అయ్యేలా ఉంది. ఈ చిత్రాన్ని మణిరత్నం..కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. ఒక్కరూ తనకు ఐలవ్ యూ చెప్పలేదంటూ సరదాగా వ్యాఖ్యానించి అందరి చూపు తన మీద పడేలా చేశారు. అంతే కాదు.. తనకు బదులుగా జోజూ జార్జ్ కు ఐలవ్యూ చెప్పారన్నారు. మణిరత్నం సమయపాలన గురించి చెబుతూ.. తెల్లవారుజామున ఐదున్నర గంటలకు షూట్ స్పాట్ కు వచ్చేస్తారన్న కమల్.. ‘ఇలాంటి టైం సెన్స్ బాలచందర్ తర్వాత మణిరత్నం వద్దే చూశా’ అని వ్యాఖ్యానించారు. తన తాజా వ్యాఖ్యలతోకమల్ హాసన్ తనలోని రొమాంటిక్ గైను బయటకు తీసుకొచ్చారని చెప్పాలి.
ఈ మూవీలో శింబు.. త్రిష.. ఐశ్వర్య లక్ష్మి.. అశోక్ సెల్వన్.. అభిరామి.. జోజు జార్జ్ తదితర ప్రముఖులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫస్ట్ సింగిల్ లాంచ్ లో ఈ మూవీ దేశ వ్యాప్తంగా అందరిచూపు పడేంత భారీగా నిర్వహించారు. ఈ మూవీని 2022 నవంబరులో అనౌన్స్ చేశారు. ఆరంభంో దీన్ని కమల్ హాసన్ 234గా పేర్కొన్నారు. అప్పటికి సినిమా పేరును డిసైడ్ చేయకపోవటంతో కమల్ నటిస్తున్న 234వ చిత్రం కావటంతో.. ప్రొడక్షన్ 234గా డిసైడ్ చేశారు. ఆ తర్వాత మూవీ పేరును థగ్ లైఫ్ గా డిసైడ్ చేశారు.
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని చెబుతున్నారు. మణిరత్నం.. కమల్ కాంబినేషన్ లో నాయకుడు తర్వాత కలిసి చేస్తున్నచిత్రం కావటంతో దీనిపై భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఆడియో రైట్స్ ను భారీ రేటుకు అమ్మేశారు. డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5న మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మణిరత్నం మేజిక్ చూపించే సినిమాలేవీ లేని వేళ.. ఈ క్రేజీ కాంబినేషన్ మీద భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి.