క్రైసిస్ క్రైసిస్: ఇండస్ట్రీని హెచ్చరించిన విశ్వనటుడు ఎంత పని చేసారో చూడండి!
అయితే ఇండస్ట్రీకి ఈ హితబోధ చేసిన కేవలం 48 గంటల లోపే కమల్ హాసన్ తాను చెప్పిన మాటలకు ఎంత కట్టుబడి ఉంటారో చేతల్లో నిరూపించి చూపించారు.
By: Sivaji Kontham | 19 May 2026 8:00 AM IST''ప్రకటనలు ఘనం- పనులు శూన్యం'' అనే నినాదం లోకనాయకుడు కమల్ హాసన్కు అస్సలు వర్తించదు. ఎందుకంటే ఆయన ఏ విషయమైనా ఆలోచించకుండా ప్రకటించరు.. ఒకవేళ ప్రకటిస్తే దానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం (ఆయిల్ క్రైసిస్) అన్ని పరిశ్రమలతో పాటు సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా కుదిపేస్తోందని ఆయన ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఒక సుదీర్ఘ లేఖ రాస్తూ.. చమురు సంక్షోభం వల్ల రవాణా ఖర్చులు ఎలా పెరుగుతాయో, అవి షూటింగుల వ్యయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో విశ్లేషించారు. నిర్మాతలు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకునేలా తెలివిగా ప్లాన్ చేయాలని.. పరిశ్రమ అంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అయితే ఇండస్ట్రీకి ఈ హితబోధ చేసిన కేవలం 48 గంటల లోపే కమల్ హాసన్ తాను చెప్పిన మాటలకు ఎంత కట్టుబడి ఉంటారో చేతల్లో నిరూపించి చూపించారు. ఒక సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం ఆయన విమానం ఎక్కాల్సి వచ్చింది. వందల కోట్ల ఆస్తులు, అంతర్జాతీయ స్థాయి స్టార్డమ్ ఉన్నా ఆయన లగ్జరీ క్లాస్ లేదా ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్లను ఎంచుకోలేదు. ఒక సాధారణ ప్రయాణీకుడిలా సాధారణ ఎకానమీ క్లాస్ టికెట్ కొనుక్కుని చెన్నై నుండి హైదరాబాద్కు ప్రయాణించారు. ప్రైవేట్ చార్టర్స్, లగ్జరీ ట్రావెల్స్ అంటూ భారీగా ప్రొడక్షన్ ఖర్చులు పెంచేసే చాలా మంది నేటి తరం స్టార్లకు కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద కనువిప్పుగా మారింది.
కమల్ హాసన్ ఇలా సాధారణ ఎకానమీ ఫ్లైట్లో ప్రయాణించి నేరుగా హైదరాబాద్లో తెరకెక్కుతున్న `కల్కి 2898 ఏడీ` సినిమా షూటింగ్ సెట్స్కు చేరుకున్నారు. ఈ పరిణామంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. ''కమల్ హాసన్ చెప్పిందే చేస్తారు, చేసేదే చెబుతారు'' అంటూ సాషల్ మీడియాలో దీనిని హైలైట్ చేస్తున్నారు. ఎంతటి గ్లోబల్ స్టార్డమ్ ఉన్నా సినిమా బడ్జెట్లను అదుపులో ఉంచడంలో.. పరిశ్రమ క్షేమం పట్ల బాధ్యత ముఖ్యమని కమల్ హాసన్ మరోసారి నిరూపించారు. పరిశ్రమ కోసం మార్పు అనేది ఎప్పుడూ మన నుంచే మొదలుకావాలనే ఆయన చొరవకు సినీ వర్గాల నుండి సైతం ప్రశంసలు అందుతున్నాయి.
ప్రస్తుతం సినీ పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ కొత్త ఆలోచనల వైపు అడుగులు వేస్తున్న సమయంలో కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశంగా మారింది. సినిమా రంగంలో భవిష్యత్ లో జరగబోయే గొప్ప మార్పులకు, వ్యయ నియంత్రణలకు ఇది తొలి అడుగు కానుంది. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ `కల్కి 2898 ఏడీ. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా `పార్ట్-2` ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.
ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్లో కమల్ హసన్ నెగటివ్ షేడ్స్ ఉన్న అత్యంత శక్తివంతమైన `సుప్రీం యాస్కిన్` పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగంలో కేవలం కొన్ని నిమిషాల పాటే కనిపించి మెప్పించిన కమల్ ఈ రెండో భాగంలో పూర్తి స్థాయి పాత్రతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఒకవైపు ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తూ.. మరోవైపు పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పుడు తన వంతుగా బడ్జెట్ భారాన్ని తగ్గించడానికి సాధారణ క్లాస్లో ప్రయాణించిన లోకనాయకుడి నిబద్ధత ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది. దిగ్గజ ఫిలింమేకర్ అయిన కమల్ హాసన్ ముందు చూపు పరిశ్రమ భవిష్యత్ ని నిర్ధేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాతలు- దర్శకహీరోలు చర్చించుకుని బడ్జెట్లను అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తేనే మంచి ఫలితం ఉంటుంది.
