Begin typing your search above and press return to search.

కల్కి.. ఈ లెక్క తేలేదెప్పుడు?

మరోసారి విడుదల తేదీని సస్పెన్స్ లో ఉంచింది మూవీ యూనిట్. దీంతో రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 8:18 AM GMT
కల్కి.. ఈ లెక్క తేలేదెప్పుడు?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన జగదేకవీరుడు అతిలోక సుందరి, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాలు మే9వ తేదీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ తోనే మే 9న కల్కిని రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ కుదరనట్లే.

ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ విషయంలో నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నా.. మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. నిన్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామగా కల్కిలో అమితాబ్ నటిస్తున్నారు. డీ-ఏజింగ్ టెక్నాలజీతో అమితాబ్ బచ్చన్ ను యువకుడిగా చూపించారు నాగ్ అశ్విన్. కోరమీసంతో లాంగ్ హెయిర్‌ లో అమితాబ్ యంగ్ లుక్ అద్భుతంగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

అయితే అమితాబ్ బచ్చన్ గ్లింప్స్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‍ ను కూడా మూవీ టీమ్ ప్రకటిస్తుందని ఆదివారం ఉదయం జోరుగా ప్రచారం సాగింది. కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం నిరాశే మిగిలింది. రిలీజ్ డేట్ లేకుండా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరోసారి విడుదల తేదీని సస్పెన్స్ లో ఉంచింది మూవీ యూనిట్. దీంతో రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.

ఇక కల్కి మూవీ మే30వ తేదీన విడుదల అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సమ్మర్ సీజన్, హాలీడేస్ ఎండింగ్ కలిసి వస్తాయని అంతా అనుకున్నారు. ఇంతలో జూన్ లో రిలీజ్ చేస్తారని మరో టాక్ వినిపించింది. ఆ తర్వాత జులైలో కల్కి విడుదల అవుతుందని గుసగుసలు వినిపించాయి. అయితే మేకర్స్.. రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీకి రాలేదని, అందుకే కేవలం బిగ్ బి ఇంట్రో విడుదల చేశారని నెటిజన్లు అంటున్నారు.

ఇక కల్కి సినిమాను భారత హిందూ పురాణాల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తో పాటు విలక్షణ నటుడు కమల్ హాసన్, హీరోయిన్ దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍ తో వైజయంతీ మూవీస్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.