కల్కి 2 : అప్పుడు 3-4.. ఇప్పుడు 7-8
ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 23 April 2025 9:30 AMప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ కలెక్షన్స్ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దర్శకుడు చూపించిన తీరు హాలీవుడ్ సినిమాల శైలిలో ఉందంటూ ప్రశంసలు దక్కాయి. కథను మధ్యలో ముగించిన దర్శకుడు సెకండ్ పార్ట్ కోసం ఎక్కువ కథను ఉంచాడని టాక్. ఇప్పటికే సెకండ్ పార్ట్కి సంబంధించి కొంత మేరకు షూటింగ్ పూర్తి అయింది. మిగిలిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఆ మధ్య ఒక సినిమా ఈ వెంట్లో నిర్వాత స్వప్న దత్, ప్రియాంక దత్లు మాట్లాడుతూ కల్కి 2898 ఏడీ సినిమా సెకండ్ పార్ట్కి సంబంధించిన షూటింగ్ 2025లో జరిగే అవకాశం ఉందని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ ఏడాదిలో సినిమా షూటింగ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు చూస్తూ ఉంటే కల్కి సినిమా కోసం ఇప్పట్లో డేట్లు ఇచ్చే అవకాశాలు లేవేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కల్కి 2 సినిమా గురించి ప్రశ్నించిన సమయంలో తనదైన శైలిలో ఫన్నీ వే లో సమాధానం ఇచ్చి, ప్రభాస్ అభిమానులు మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అని చెప్పకనే చెప్పాడు.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... ఇంతకు ముందు మనం కలిసినప్పుడు కల్కి 2898 ఏడీ మూడు-నాలుగు గ్రహాలు కలిసిన సమయంలో విడుదల అవుతుందని చెప్పాను. ఇప్పుడు ఏడు-ఎనిమిది గ్రహాలు కలిసిన తర్వాత సీక్వెల్ విడుదల ఉండే అవకాశం ఉందని అన్నాడు. నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సీక్వెల్ విడుదల తేదీ విషయంలో ఆయనకు కూడా స్పష్టత లేదని తెలిసి పోయింది. కథ ఇతర విషయాలు అన్నీ పార్ట్ 2 కోసం సిద్ధంగా ఉన్నాయి. అయినా ఎందుకు ఆలస్యం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సీక్వెల్ కోసం వెయిట్ చేయించి బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్తో పాటు ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, శోభన, దీపికా పదుకునే, దిశా పటానీ ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కనిపించారు. దీపికా పదుకునే ను మొదటి పార్ట్లో గర్భవతిగా చూపించారు. సెకండ్ పార్ట్లో ఆమె కల్కికి జన్మనివ్వడం, ఆ బిడ్డ చుట్టూ కథ తిరగడం మనం చూడబోతున్నామని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి కథ విషయమై ఎలాంటి లీక్ లేదు. కానీ మహాభారతంను మరింత ఎక్కువగా చూపించబోతున్నారని, పలువురు స్టార్స్ మళ్లీ సెకండ్ పార్ట్లోనూ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తానికి సీక్వెల్ ఎప్పుడు వచ్చిన తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి.