ఈ సారి విజువల్ వండర్ కాకుండా ఎమోషనల్ వండర్..!
గతంలోనే జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకు 'లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా' టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
By: Ramesh Palla | 31 Dec 2025 8:00 PM ISTప్రపంచ ప్రసిద్ది గాంచిన దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ తాజాగా అవతార్ కొత్త సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. అయినా కూడా కొందరు జేమ్స్ కామెరూన్ రేంజ్ లో లేదని, ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదని పెదవి విరుస్తున్నారు. ఇండియాలో అవతార్: ఫైర్ అండ్ యాష్ కి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు అనే మాట వాస్తవం. అందుకే అవతార్ ప్రాంచైజీలో చేయాల్సిన నాలుగు, అయిదు పార్ట్లను జేమ్స్ కామెరూన్ కొంత కాలం పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం అది నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి. చాలా కాలం క్రితం జేమ్స్ కామెరూన్ హిరోషిమా నేపథ్యంలో సినిమా తీస్తాను అంటూ ప్రకటన చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు అయినట్లుగా అప్పట్లోనే జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చాడు.
అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమాకి...
అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ హిరోషిమా గురించి ప్రస్తావించడం జరిగింది. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను ఆయన రివీల్ చేసినట్లుగా హాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురితం చేస్తోంది. ఇప్పటి వరకు ఆయన విజువల్ వండర్ సినిమాలను రూపొందిస్తూ వచ్చాడు. గ్రాఫిక్స్ నేపథ్యంలో సినిమాలను రూపొందిస్తూ వచ్చిన జేమ్స్ కామెరూన్ ఈసారి హిరోషిమా నేపథ్యంలో రూపొందించబోతున్న సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా చూపిస్తాడని తెలుస్తోంది. అణుబాంబు వల్ల జరిగే నష్టం, దాని వల్ల జనాలు ఎదుర్కొన్న ఇబ్బందులు... ఇలా చాలా విషయాల గురించి ఆయన చాలా ఎమోషనల్గా చూపించడం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాడని అంతా అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
జేమ్స్ కామెరూన్ సినిమాలో...
గతంలోనే జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకు 'లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా' టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. గతంలో చార్లెస్ పెల్లెగ్రినో రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించే విధంగా జేమ్స్ కామెరూన్ ఒప్పందం చేసుకున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన మారణ హోమం, అణుబాంబు దాడి గురించి ఈ సినిమాలో చూపించే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా హ్యూమన్ ఎమోషన్స్ ను ఈ సినిమాలో చూపించవచ్చు. ఈ సినిమాలో యుద్ద సన్నివేశాలు సైతం భారీగా ఉంటాయి. అణుబాంబు దాడి కి సంబంధించి ఇప్పటి వరకు చాలా కథనాలు ఉన్నాయి. అయితే పెల్లెగ్రినో రాసిన పుస్తకంలో కాస్త విభిన్నమైన వర్షన్ ఉంటుందని అంటారు. కనుక జేమ్స్ కామెరూన్ తన సినిమాలో హిరోషిమా గురించి చెప్పడం ద్వారా కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అణుబాంబు దాడులపై మరింత అవగాహన పెరిగే అవకాశాలు ఉన్నాయి.
లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా...
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఉండి, అణుబాంబు దాడులు ప్రత్యక్షంగా చూసి, ఇప్పటికీ బతికి ఉన్న వారి అనుభవాలను తీసుకుని రాసిన పుస్తకం ఆధారంగా తీసుకుని సినిమాను రూపొందించేందుకు గాను దర్శకుడు జేమ్స్ కామెరూన్ వర్క్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జేమ్స్ కామెరూన్ సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి, వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రాంచైజీగా రెండు మూడు పార్ట్లుగా వస్తూ ఉంటుంది. కానీ హిరోషిమా సినిమా మాత్రం సింగిల్ పార్ట్లోనే రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పై జేమ్స్ కామెరూన్ మరిన్ని సినిమాలను సైతం లైన్ లో ఉంచాడు. అవతార్ తో పాటు ఇతర సినిమాలకు తీసుకున్న స్థాయిలో కాకుండా ఈసారి తక్కువ సమయం తీసుకుని సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు కామెరూన్ భావిస్తున్నాడు అనేది కూడా హాలీవుడ్ మీడియా సంస్థల కథనం. జేమ్స్ కామెరూన్ ఏ సినిమా తీసినా ప్రపంచం మొత్తం ఆ సినిమాను చూసేందుకు రెడీగా ఉంది. కనుక హిరోషిమా వంటి ఒక కథను తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈసారి ఎమోషనల్ వండర్గా సినిమా నిలుస్తుందనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
