చిరంజీవి తలచుకున్నా జరగదు.. మెగా ఫ్యాన్స్ నిరాశ
అశ్విని దత్ వారసురాళ్లు ప్రియాంక -స్వప్న దత్ ఈ సీక్వెల్ లేదా రీమేక్ను నిర్మించాలని భావిస్తున్నట్టు చిరు తెలిపారు.
By: Tupaki Desk | 10 May 2025 4:38 AM90లలో వరదల్లో విడుదలై సంచలన వసూళ్లు సాధించిన సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - శ్రీదేవి జంటగా అశ్వనిదత్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ సినిమా విడుదలై ఇప్పటికే మూడున్నర దశాబ్ధాలు అయింది. మే 9న తిరిగి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా మెగాభిమానుల నుంచి అద్భుత స్పందన లభించింది.
ఇంద్రలోకం నుంచి భువికి దిగి వచ్చిన ఇంద్రజతో ప్రేమలో పడే భూలోక వీరుడిగా చిరంజీవి నటన అద్భుతం. ఇంద్రుని కుమార్తె ఇంద్రజగా దివంగత నటి శ్రీదేవి నటన మహదాద్భుతం. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నామని మేకర్స్ ప్రకటించిన ప్రతిసారీ అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. కానీ చివరికి సీక్వెల్ లేదు! అని తెలిసాక చాలా నిరాశకు గురవుతున్నారు. అశ్వనిదత్, చిరంజీవి సహా 90ల నాటి క్లాసిక్ తో సంబంధం ఉన్న పలువురు సీక్వెల్ తెరకెక్కడం ఖాయమని ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నాలు సాగకపోవడం విస్మయపరుస్తూనే ఉంది.
చాలా కాలంగా రామ్ చరణ్- జాన్వీ కపూర్ జంటగా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తెరకెక్కుతుందని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. ఇంతకుముందు బుచ్చిబాబు 'పెద్ది' లాంచింగ్ ఈవెంట్లో రామ్ చరణ్ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గురించి ప్రస్థావించారు. జాన్వీతో తాను ఈ సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నట్టు చరణ్ చెప్పారు. తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తాను ఈ సినిమా సీక్వెల్ చేయాలని భావిస్తున్నా కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయలేనని, అది చాలా ప్రతిష్టాత్మకంగా అనిపిస్తుందని చిరు సరదాగా వ్యాఖ్యానించారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తో చరణ్ ఈ సీక్వెల్ లో నటిస్తే బావుంటుందని అన్నారు. ఒకవేళ రీమేక్ చేసినా ఫర్వాలేదని సూచించారు.
అశ్విని దత్ వారసురాళ్లు ప్రియాంక -స్వప్న దత్ ఈ సీక్వెల్ లేదా రీమేక్ను నిర్మించాలని భావిస్తున్నట్టు చిరు తెలిపారు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో అశ్వని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ దీనికి దర్శకత్వం వహించాలని కూడా చిరు ఆకాంక్షించారు. ఒకవేళ అలా చేస్తే ఇది చారిత్రాత్మకం అవుతుందని కూడా చిరు వ్యాఖ్యానించారు. చరణ్- జాన్వీ నాయకానాయికలుగా సీక్వెల్ తెరకెక్కాలని ఆశిద్దాం.