రూ.6 టికెట్.. రూ.210. ఇదేం క్రేజ్ బాసూ!
తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్లో ఒకటి మరియు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ గొప్ప సినిమాగా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది.
By: Tupaki Desk | 5 May 2025 5:00 AM ISTతెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్లో ఒకటి మరియు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ గొప్ప సినిమాగా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. మే9 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మే9, 1990 లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 9 రోజున మరోసారి నిర్మాతలు ఆ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.
అప్పుడు రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ లానే మిగిలిపోయింది. రిలీజైన టైమ్ లో ఈ సినిమా పేరిట చాలానే రికార్డులు నమోదయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్ టైమ్ లో టికెట్ రేటు రూ.6. కానీ మ్యాట్నీ షో కు ఆ టికెట్లు రూ. 210 లకు అమ్ముడయ్యాయంటే సినిమా క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అంటే మామూలు టికెట్ రేటుకు అది 35 రెట్లు ఎక్కువన్నమాట.
ఈ సినిమాలో చిరంజీవి టూరిస్ట్ గైడ్ గా కనిపించగా, శ్రీదేవి ఇంద్రజ పాత్రలో నటించింది. వీరిద్దరితో పాటూ అమ్రిష్ పూరి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలినీ, బేబీ షామిలీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఆ రోజుల్లో భారీ బడ్జెట్ తో ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన విషయం తెలిసిందే.
అబ్బ నీ తీయని దెబ్బ అనే సాంగ్ గురించి గతంలో చిరంజీవి ఓ సారి చెప్తూ ఆ సాంగ్ ను ఒక రోజులోనే కంపోజ్ చేశామని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారని చెప్పాడు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు వర్క్ స్టార్ట్ చేసి, మధ్యాహ్నం 12.30 గంటల్లోపు ట్యూన్ ఇచ్చారని, ఆ ట్యూన్ అందరికీ నచ్చిందని లంచ్ టైమ్ లో వేటూరి గారు లిరిక్స్ రాశారని, ఆ తర్వాత బాలు గారు దాన్ని ఎంతో సరదాగా పాడారని చెప్పాడు.
దినక్కుతా అనే సాంగ్ షూట్ చేసే టైమ్ లో చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారని, ప్రతీ షాట్ బ్రేక్ టైమ్ లో అతని బాడీని ఐస్ ప్యాక్ లతో, బట్టలతో కవర్ చేసి చల్లపరిచామని, శ్రీదేవి కాల్షీట్స్ రెండ్రోజులు మాత్రమే ఉండటంతో ఆ సాంగ్ కోసం ఆయన చాలా కష్టపడ్డారని, షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ హాస్పిటల్ లో జాయిన్ చేయగా, ఆయన రెండు వారాల తర్వాత డిశ్చార్జ్ అయ్యారని నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించిన ఈ సినిమాకు జంధ్యాల స్క్రీన్ ప్లే అందించారు. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ కు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మే 9న రిలీజ్ కానున్న జగదేకవీరుడు అతిలోక సుందరి ఈసారి ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.
