జటాయు లేట్కు కారణమేంటంటే..
హీరోలకైనా, హీరోయిన్లకైనా, డైరెక్టర్లకైనా, నిర్మాతలకైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి.
By: Tupaki Desk | 20 April 2025 7:30 PMహీరోలకైనా, హీరోయిన్లకైనా, డైరెక్టర్లకైనా, నిర్మాతలకైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎప్పటికైనా ఎలాగైనా వాటిని తీయాలని నిరంతరం దాని కోసమే కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా తనకు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని, ఎప్పటికైనా దాన్ని తానే తెరకెక్కిస్తానని చెప్తున్నారు.
గ్రహణం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఇంద్రగంటి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకుని తన సత్తాను చాటుకున్నారు. ఆ సినిమాతోనే తన అభిరుచిని తెలియచేసిన ఇంద్రగంటి నుంచి తర్వాత అష్టాచెమ్మా, సమ్మోహనం లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీస్ వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మంచి అభిరుచి, తెలుగుదనం నిండిన సినిమాలు తీసే అతి కొద్దిమంది డైరెక్టర్లలో ఇంద్రగంటి కూడా ఒకరు.
ఆయన ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర్నుంచి చిన్న, మీడియం సినిమాలే చేశారు తప్పించి స్టార్ హీరోలతో ఎప్పుడూ సినిమాలు చేసింది లేదు. కానీ అందరిలానే ఆయనక్కూడా ఓ భారీ సినిమా తీయాలనే కోరిక ఉందని, దాని కోసం తన దగ్గర జటాయు అనే స్టోరీ రెడీగా ఉందని, రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఆ సినిమాను తీయాలనుకుని దిల్ రాజు నిర్మాతగా ఆ ప్రాజెక్టు మొదలవుతుందని వార్తలు కూడా వచ్చాయి.
జటాయు గురించి వార్తలైతే వచ్చాయి కానీ ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్ గా ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన సారంగపాణి జాతకం ప్రమోషన్స్ లో భాగంగా ఆయన జటాయు గురించి మాట్లాడారు. వాస్తవానికి సారంగపాణి జాతకం కంటే ముందుగానే జటాయు చేద్దామనుకున్నానని, దిల్ రాజు కూడా ఓకే అన్నారని చెప్పారు.
కానీ కొన్నాళ్ల తర్వాత గేమ్ ఛేంజర్ సినిమా ఫినిష్ అవడానికి ఎక్కువ టైమ్ పడుతుందని తెలిసి మధ్యలో మరో సినిమా చేసుకుని రమ్మని దిల్ రాజు తనకు చెప్పారని, అలా సారంగపాణి జాతకం సినిమా తెరకెక్కిందని, జటాయు సినిమా ఎప్పటికైనా తానే తీస్తానని, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, వేరే డైరెక్టర్ కు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వనని ఇంద్రగంటి తెలిపారు.