కోర్టు వివాదాల్లో నలిగిపోతున్న చిత్రాలివే!
ఈ వివాదంపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ఆవేదన చెందారు.
By: Srikanth Kontham | 25 Feb 2026 2:00 PM ISTఎలాంటి ఆటంకాలు లేకపోతే సినిమా ఎంత స్వేచ్ఛగా రిలీజ్ అవుతుందో? ఏదైనా ఆటంకం ఎదురైందంటే?విడుదలన్నది అంతకంతకు జఠిలమవుతుంది. రిలీజ్ అంతకంతకు వాయిదా పడే కొద్ది అసలు రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు బలపడుతుంటాయి. చిన్న చిన్న వివాదాలైతే కోర్టులు కూడా క్లియరెన్స్ తొందరగా ఇస్తాయి. చట్టపరమైన వివాదాలు..దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలు వ్యక్తమైతే మాత్రం రిలీజ్ మరింత కఠినంగా మారుతుంది. ప్రస్తుతం ఓ ఐదు సినిమాలు కోర్టు వివాదంలో పడి నలిగిపోతున్నాయి.
వీటిలో కొన్ని సినిమాలు సెన్సార్ నుంచే ఆటంకాలకు గురైతే? మరికొన్ని సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చినా? కోర్టు క్లియరెన్స్ లేక విడుదలకు నోచుకోలేదు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళ హీరో విజయ్ నటించిన `జననాయగన్` వివాదం ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్లిందో తెలిసిందే. `జన నాయగన్` వివాదం కేవలం సెన్సార్కే పరిమితం కాకుండా రాజకీయ, న్యాయపరమైన మలుపులు తిరిగింది. తొలుత ఈ సినిమాకు సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చిహ్నాలు తప్పుగా వాడారని, కొన్ని సన్నివేశాలు మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
దీంతో దాదాపు 27 కట్స్ , మ్యూట్స్ పడ్డాయి. రాజకీయంగా సున్నితమైన డైలాగులు (రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను విమర్శించేవి) ఉన్నాయని ప్రచారంలోకి వచ్చింది. దీంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. తొలు సింగిల్ జడ్జి సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. కానీ సెన్సార్ అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ ఆ తీర్పుపై స్టే విధించింది. అనంతరం వివాదం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. కానీ సుప్రీం ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో కేసు ఇంకా పెండింగ్ లో ఉంది.
ఈ వివాదంపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ఆవేదన చెందారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాగే శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న `సెయోన్` టైటిల్ కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ టైటిల్ 2022లో రిలీజ్ అయిన `మాయోన్` కు సీక్వెల్ గా ఉందని, ఇది తమ టైటిల్ అని ఓ నిర్మాణ సంస్థ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసింది. దీంతో శివ కార్తికేయన్ టీమ్ చట్ట పరంగా ముందుకెళ్తోంది.
అలాగే నీరజ్ పాండే తెరకెక్కిస్తోన్న`ఘూస్ఖోర్ పండిట్` కూడా టైటిల్ వివాదాన్ని ఎదుర్కుంటోంది. ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని కించపరిచేలా టైటిల్ ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాగే మలయాళ చిత్రం `ది కేరళ స్టోరీ 2` కూడా హైకోర్టులో నలుగుతోంది. మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని...సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీంతో ఈ సినిమాను హైకోర్టు సభ్యులు వీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతోన్న వేళ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
