ఇండియన్ సినిమాని మార్చిన టాప్ సీక్వెల్స్!
ఇండియన్ సినిమా తీరు మారుతోంది..తరం మారుతున్నా కొద్దీ సినిమా తీరు కూడా మారుతూ వస్తోంది.
By: Ravindar Gorantla | 5 April 2026 7:00 PM ISTఇండియన్ సినిమా తీరు మారుతోంది..తరం మారుతున్నా కొద్దీ సినిమా తీరు కూడా మారుతూ వస్తోంది. అయితే ఈ విప్లవత్మక మార్పుకు మాత్రం శ్రీకారం చుట్టింట కేవలం దక్షిణాది మాత్రమే. అందులో టాలీవుడ్ ప్రధాన పాత్ర పోషించింది. ఇండియన్ సినిమా అంటే వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడ్డ బాలీవుడ్ మాత్రమేనని భావించిన హాలీవుడ్ మేకర్స్కి, ఇతర దేశాల ప్రేక్షకులకు ఇండియన్ సినిమా అంటే భారతీయ మూలాలున్న కథలని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఇక్కడి ఎమోషన్స్కు అద్దంపట్టే కథలని స్పష్టం చేసింది.
ఇండియన్ సినిమా స్వరూపాన్ని సమూలంగా మార్చేసి ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపిన సినిమాలు నాలుగు. బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2, ధురంధర్ 2. అయితే ఆ మార్పు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అత్యంత సాహసోపేతంగా చేసిన `బాహుబలి`తో మొదలైంది. తొలి భాగం కొత మేర మార్పుకు శ్రీకారం చుట్టినా `బాహుబలి 2` వసూళ్ల పరంగా, గ్రాండీయర్ పరంగా, స్టోరీ పరంగా మా సినిమాలు హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవని, మేము కూడా బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని రూపొందిస్తామని యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది.
ఫస్ట్ పార్ట్ రూ.650 కోట్లు రాబట్టగా, పార్ట్ 2 రూ.1810 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఈ రెండు బాగాలకు కలిపి రూ.2410 కోట్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా అందించిన ఉత్సాహం, ధైర్యంతో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా `కేజీఎఫ్`. ఫస్ట్ పార్ట్ రూ.250 కోట్లు రాబట్టగా, సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ చాప్టర్ 2` అనూహ్యంగా రూ.1250 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా కన్నడ ఇండస్ట్రీని ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసింది.
ఈ రెండు భాగాలు కలిపి సాధించిన వసూళ్లు రూ.1500 కోట్లు. ఇదే జోరుని మరింతగా పెంచేసి ఇండియన్ సినిమా సత్తా ఏంటో మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమా `పుష్ప 2`. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్
వరల్డ్ వైడ్గా రూ.360 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే దీని తరువాత ఏర్పడిన క్రేజ్ కారణంగా `పుష్ప 2` వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.1642 కోట్లు రాబట్టి బన్నీని పాన్ ఇండియా స్టార్ల జాబితాలో తిరుగులేని స్టార్గా చేర్చింది. ఈ రెండు సినిమాల ద్వారా వచ్చిన మొత్తం వసూళ్లు రూ. 2002 కోట్లు.
పాన్ ఇండియా చిత్రాల క్రేజ్ని పీక్స్కు తీసుకెళ్లి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన మూవీ `ధురంధర్`. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రూ.1350.83 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న `ధురంధర్ 2` ఇప్పటి వరకు రూ.1555.28 కోట్లు రాబట్టి ఇప్పటికీ అదే జోష్తో రికార్డుల వేట సాగిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు భాగాలు కలిపి సాధించిన మొత్తం రూ.2906.11 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలతో పాటు ఇండియన్ సినీ వర్గాలని షాక్కు గురి చేస్తోంది. ఇండియన్ సినిమాని సమూలంగా మార్చిన టాప్ సీక్వెల్స్లలో `ధురంధర్ 2` ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని టాప్లో నిలిచింది.
